రాహుల్కు జ్ఞాపకశక్తి తగ్గిందా..? అనుమానం లేవనెత్తిన కేంద్రమంత్రి.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనుమానం వస్తుందన్నారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. మత్స్యశాఖకు సంబంధించిన ప్రశ్నను హర్యానాకు చెందిన ఎంపీ సునీతా దుగ్గల్ లోక్సభలో లేవనెత్తారు. మత్స్య సంపదకు సంబంధించి.. వాటి ఉత్పత్తి కోసం ప్రత్యేకమైన పథకాన్ని ఏదైనా ప్రవేశపెట్టారా..? అంటూ ఎంపీ సునీతా దుగ్గల్ కేంద్ర మంత్రిని లోక్సభలో అడిగారు. సదరు ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల తాను హార్ట్ అయ్యానన్నారు. మత్స్యశాఖకు సంబంధించి రాహుల్ గాంధీ ఫిబ్రవరి తొలివారంలో ఓ ప్రశ్న వేశారని.. ఆ తర్వాత పలు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యశాఖను ఏర్పాటు చేస్తానని హామీఇచ్చారని గుర్తుచేశారు. అయితే కేంద్రలో ప్రస్తుతం ఏయే శాఖలు ఉన్నాయో కూడా తెలియనంత బిజీగా రాహుల్ ఉన్నారా..? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఆయనకు జ్ఞాపకశక్తి కూడా తగ్గిందనుకుంటా..? అని సందేహం వ్యక్తం చేశారు.
జ్ఞాపక శక్తి తగ్గకపోతే రాహుల్ అలా మత్స్యశాఖ గురించి మాట్లాడి ఉండేవారు కాదన్నారు. అనంతరం.. మత్స్య సంపద అభివృద్ధి కోసం మోదీ సర్కార్ చేస్తున్న కార్యక్రమాల గురించి సభకు తెలియజేశారు.