సరిహద్దులో మరోసారి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్ము జిల్లాలోని ఆర్నియా సెక్టార్ వైపు గురిపెట్టారు పాక్ రేంజర్లు. అక్కడ గస్తీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లపైకి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరిపింది. అలర్టైన బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం పాక్ రేంజర్లకు గట్టిగానే బదులిచ్చారు.
ఈ కాల్పుల్లో భారత జవాన్లకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. జమ్మూ-కశ్మీరు వెంబడి అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పుల విరమణను పునరుద్ధరించాలని 2020 ఫిబ్రవరిలో భారత్, పాకిస్థాన్ అంగీకారానికి వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి వ్యవసాయ పనులు మళ్లీ మొదలుపెట్టారు. కానీ అప్పుడప్పుడూ ఇలా పాక్ రేంజర్లు కాల్పుల నియంత్రణను ఉల్లంఘిస్తుంటారు.