అన్నదాతా.. మన్నించు!
సాగు చట్టాలకు బ్రేకు పడింది. రైతులకు నిజమైన స్వాతంత్ర్యం అందినట్టే అంది, తాత్కాలికంగా చేజారిపోయింది. మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. పంజాబ్ నుంచి వచ్చిన గుప్పెడు ముంది రైతుల ముసుగులో ఢిల్లీ శివార్లలో తిష్టవేసి ఆధునిక టెంట్లు వేసుకుని కేంద్రాన్ని ఒక ఆట ఆడించే ప్రయత్నం చేశారు. వందల ట్రాక్టర్లతో వీరంగం చేయడానికి సిద్ధపడ్డారు. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో ట్రాక్టర్లతో బలప్రదర్శన చేస్తామని బెదిరించారు. చివరకు వారి బెదిరింపులే భయపెట్టాయో, లేక కేంద్రం సరిగ్గా వ్యవహరించలేదనే అభిప్రాయానికి పైచేయి అయిందోగానీ, సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ చట్టాలను అమలు చేయడం నిలిచిపోయింది. అబద్ధాలను ఉద్యమ స్థాయిలో ప్రచారం చేసి నమ్మించే కళలో ఆరితేరిన కొన్ని పార్టీల వారు ఈ ఆందోళనను స్పాన్సర్ చేశారనే ఆరోపణలు బలంగానే వచ్చాయి. మొత్తానికి రైతు వ్యతిరేక శక్తులు ప్రస్తుతానికి గెలిచాయనేది చేదు వాస్తవం. బిజెపి వ్యూహాత్మక వైఫల్యం కూడా దీనికి కారణం.
భారతదేశంలో 135 కోట్ల మంది ప్రజలున్నారు. పంజాబ్ రాష్ట్ర జనాభా 2.8 కోట్లు. అందులో బహుశా 0.01 శాతం మంది ఆందోళన పేరుతో ఢిల్లీ శివార్లకు చేరుకుని ఉంటారు. కేవలం ఈ గుప్పెడు మంది కారణంగా దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు కొత్త చట్టాలు ప్రస్తుతానికి అందకుండా పోయాయి. తదుపరి ఉత్తర్వులు ఈ చట్టాలకు అనుకూలంగా ఉంటాయో లేక వ్యతిరేకంగా ఉంటాయో తెలియదు. తమ పంట ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని సంబరపడిన రైతులకు నిరాశే ఎదురైంది. పైగా ఈ పరిణామం ఒక అనారోగ్యకరమైన ట్రెండుకు నాంది పలికితే అది మరింత ప్రమాదకరం. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, తీసుకున్న నిర్ణయాలు నచ్చని వారు రైతుల పేరుతో వందల మందిని రోడ్ల మీద కూర్చోబెట్టి యావత్ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టడానికి భవిష్యత్తులో ప్రయత్నించ వచ్చు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేక ఇలాంటి బెదిరింపులను ఒక దందాగా మార్చుకుంటే ఇక దేశం ముందుకు పోవడం అసాధ్యం కావచ్చు.
సుప్రీంకోర్టు తమ ముందున్న ఆధారాలు, వాస్తవాల ప్రాతిపదికనే ఈ తీర్పు వెలువరించింది. సాగు చట్టాలకు అనుకూలంగా ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాకపోవడం కూడా కోర్టును ప్రభావితం చేసి ఉండొచ్చు. పరిస్థితి విషమిస్తే అందరికీ ఇబ్బందే అనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు స్టే విధించింది, ఒక కమిటీని నియమించిందని అర్థమవుతుంది. కానీ, రైతు చేతులకున్న ఆంక్షల బేడీలు తొలగిపోయాయి అని సంబరపడినంత సేపు పట్టలేదు, మళ్లీ తాత్కాలికంగా సంకెళ్లు పడటానికి.