విదేశీ ఉత్పత్తుల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు ఇచ్చారు. నేరుగా చెప్పకపోయినప్పటికీ, చైనా ఉత్పత్తుల గురించే మోదీ ఈ మాట అన్నారు అని అర్థం అవుతోంది. ఇప్పుడు బాయ్ కాట్ చైనా పేరుతో ఈ విషయం మీద సోషల్ మీడియాలో కంటెంట్ ట్రెండింగ్ అవుతోంది. ఎందుకంటే మన దేశం ప్రతీ ఏటా అతి ఎక్కువ వస్తువులను దిగుమతి చేసుకొనేది చైనా నుంచే. అంటే మన డబ్బులన్నీ చైనా వాళ్లు ఎగరేసుకొని పోతున్నారు. ఆ డబ్బులతోనే ఆయుధాలు తయారుచేసి, పాకిస్థాన్ కు పంపిస్తున్నారు. అందుచేత చైనా ను కంట్రోల్ చేయాలంటే ఇక్కడ నుంచి నరుక్కొని రావాలని మోదీ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
బాయ్ కాట్ చైనా నినాదం గతంలో కూడా తెర మీదకు వచ్చింది. 2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సరిహద్దు ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చైనాతో ఘర్షణలో 20 మంది భారత సైనికులు సైతం మరణించారు. దీంతో డ్రాగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారతీయులు.. #BoycottChina అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక ఉద్యమానికి తెరలేపారు. చైనా నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బట్టలు, బొమ్మలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయకూడదని ప్రజలు పిలుపునిచ్చారు. ఆ సందర్భంలోనే ‘వోకల్ ఫర్ లోకల్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి ప్రచారాలు ఊపందుకున్నాయి. అటు భారత్ సైతం ఆ సమయంలోనే TikTok, WeChat, UC Browser సహా 200కు పైగా చైనా యాప్లపై నిషేధం విధించింది.
అంత మాత్రాన చైనా నుంచి దిగుమతులు పెద్దగా తగ్గిపోలేదు. ఇప్పటికీ భారతీయులు చైనా ఉత్పత్తులనే విరివిగా కొనేస్తున్నారు. అందుకే ప్రతీ పట్టణం, నగరాల్లోనూ చైనా బజార్లు విరివిగా కనిపిస్తున్నాయి. చీప్ వస్తువులను చీప్ గా కొనేసే మనస్తత్వం భారతీయులకు ఉండటంతో సమస్య ఏర్పడుతోంది. అందుచేతనే మేడిన్ చైనా వస్తువులను కొనేసుకొని మురిసిపోతున్నారు. చైనా ఉత్పత్తుల దెబ్బకు భారత్ లోని చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి. వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడిన పరిస్థితి.
మరో వైపు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెషినరీలలో మరో బాగోతం నడుస్తోంది. ఈ పరికరాలు భారత్ లోనే తయారు అవుతున్నప్పటికీ, అందులో వాడే చిన్న పార్ట్ లు, స్పేర్ పార్టులను చైనా నుంచే తెప్పించుకొంటున్నారు. వీటిని తయారు చేసేందుకు భారతీయ యూనిట్ లు ఉన్నప్పటికీ, మన పారిశ్రామికవేత్తలకు చైనా మెటీరియల్ మీదనే మోజు ఉంటుంది. అందుచేత ఈ మార్గంలో వేల కోట్ల రూపాయిలు చైనాకు తరలి వెళుతున్నాయి.
ఆఖరికి వినాయకుని విగ్రహాలు, దీపావళి బాణసంచా, దసరా పతంగులు కూడా చైనావే మన దగ్గర తిష్టవేసుకొని ఉన్నాయి. చైనా వస్తువులు ప్రమాదకరం అని తెలిసినప్పటికీ, మన వ్యాపారులు ఏ మాత్రం తగ్గటం లేదు. దర్జాగా చైనా ఉత్పత్తులనే టెంట్లు వేసి మరీ అమ్మేస్తున్నారు. మనం కూడా గుడ్డిగా చైనా ఉత్పత్తులను కొనుక్కొంటూ పండగ చేసుకొంటున్నారు. ఈ విషయంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం దేవీ దేవతల విగ్రహాలు అయినా స్వదేశీ ఉత్పత్తులను కొనుక్కోండి అని పెద్దాయన బతిమాలుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడే మరో విషయం చూడాల్సి ఉంది. కొంతకాలంగా టర్కీ మీద కూడా భారత్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పహల్గాం దాడుల సమయంలో ప్రపంచమంత భారత్ కు మద్దతు ఇస్తే,, టర్కీ మాత్రం పాకిస్తాన్ వెనుక నిలిచింది. దీంతో టర్కీని దూరం పెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఇక్కడి వ్యాపారస్తులు టర్కీ దేశానికి చెందిన ఆపిల్స్, మార్బుల్స్ పై నిషేధం విధించారు. అదే సమయంలో టర్కీ టూరిజాన్ని సైతం భారతీయులు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది వ్యాపారులు టర్కీ ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. కానీ దీనిని ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. దీంతో టర్కీకి పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లలేదు. అందుచేతనే పాకిస్తాన్ కు టర్కీ అన్ని రకాలుగా సహాయం చేస్తూనే ఉంది.
అందుచేత చైనా విషయంలో అయినా భారతీయులు మేలుకొనాల్సి ఉంది. మేడిన్ చైనా వద్దు, మేకిన్ ఇండియా ముద్దు అని గుర్తెరగాలి. సోషల్ మీడియాలో Boycott china ,Go china, Ban china , Go Chinese Go అనే హ్యాష్ టాగ్స్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చైనా విషయంలో సీరియస్ గా ఉన్న పరిస్థితులతో గణనీయంగా చైనా ఉత్పత్తుల ను దూరం పెట్టాలి. ఇందుకు ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతీ ఏటా చైనాకు వెళుతున్న వేల కోట్ల రూపాయలు భారత్ దగ్గరే ఉండిపోతాయి. అప్పుడే నరేంద్ర మోదీ పిలుపుకి సార్ధకత ఏర్పడుతుంది.