ఓ ర్యాలీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నినాదాలు చేసిన వ్యవహారంలో కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.పిల్లాడిని ర్యాలీకి తీసుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ర్యాలీలో బాలుడి స్లోగన్స్ కు సంబంధించిన వీడియో రెండురోజులుగా వైరల్ అవుతోంది. పీఎఫ్ఐ చిన్నపిల్లల్ని వాడుకుంటూ సమాజంలో ఇరువర్గాల మధ్య విద్వేషాలు నింపుతోందంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
కేరళ అలెప్పుజాలో పీఎఫ్ఐ ఆధ్వర్యంలో సేవ్ ది రిపబ్లిక్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఓ బాలుడితో రెచ్చగొట్టే స్లోగన్లు చేయించారు నిర్వాహకులు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అవి ఉన్నాయి. నినాదాలన్నీ హెచ్చరికలుగా కనిపిస్తున్నాయి. ఉంటే నోర్మూసుకుని పడుండండి. లేదంటే చావండి…మీ అంతు చూసే కసాయిలం మేం వస్తున్నాం. మీ చావు తథ్యం. మీ ఆఖరి ఊరేగింపుకు బియ్యం, పూలు సిద్ధం చేసుకోండి. సంఘీలు మీకూ ఈ హెచ్చరికలు మేం వస్తున్నాం అంటూ నినాదాలు చేశాడు ఆబాలుడు.
అయితే ఆర్ఎస్ఎస్ ను మాత్రమే ఆ బాలుడు అన్నాడని…హిందువులకు వార్నింగ్ ఇవ్వలేదని పీఎఫ్ఐ చైర్మన్ ఒమా సలామ్ సమర్థించుకోజూశాడు.
అటు రాజకీయ, మతపరమైన ర్యాలీల్లో పిల్లలను ఇలా వాడుకోవడంపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలు ఇలాంటి ద్వేషపూరిత వాతావరణంలో పెరగడం ఆందోళనకరం అని..కొత్తతరాన్ని ఇలా పెంచడం సరికాదని కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గోపీనాథ్ వ్యాఖ్యానించారు.