జమ్ముకశ్మీర్ రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి సహా
ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. పీర్ పంజల్ రేంజ్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చొరబాట్లను అడ్డుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. సురన్కొటేలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే నిఘావర్గాల సమాచారంతో భారత బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపింది.
కొందరు వాస్తవాధీన రేఖను దాటి చర్మేర్ అటవీ ప్రాంతంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సైనికాధికారులకు సమాచారం వచ్చింది. దీంతో భద్రతాసిబ్బంది అటవీప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఆ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి, మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. ముష్కరులు నక్కిన అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సైన్యం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. కొన్నిరోజులుగా లోయలో పౌరులపై ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. ఇద్దరు కశ్మీర్ పండిట్లు సహా పలువురిని పొట్టనపెట్టుకున్నారు కూడా. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు బందిపొరా జిల్లా గుండ్ జహాంగీర్, అనంత్నాగ్లోని ఖాగుండ్లో వేర్వేరుగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఓ పోలీసుకు గాయాలయ్యాయి. బందిపొరాలో మృతి చెందిన ఉగ్రవాదిని లష్కర్ ఇ తోయిబా అనుబంధ ది రెసిస్టెన్స్ ఫోర్స్ కు చెందిన ఇంతియాజ్ అహ్మద్ దార్గా గుర్తించారు.

file photo