కేరళ బీజేపీకి బూస్టింగ్..పార్టీ కండువా కప్పుకున్న మెట్రో మ్యాన్
కేరళలో రాజకీయాల్లో మార్పులు ప్రారంభమయ్యాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పినరయ్ విజయ్ సర్కార్ను ఏ విధంగానైనా గద్దె దించేందుకు బీజేపీ సర్కార్ పావులుకదుపుతోంది. అందుకోసం కేరళలో పార్టీ పట్టును పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వివిధ రంగాల ప్రముఖులను పార్టీలో చేర్చుకుంటుంది. ఇప్పటికే అథ్లెట్ పరుగుల రాణిగా పేరొందిని పీ.టీ.ఉషాను బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు కూడా దేశ వ్యాప్తంగా హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు చేరుతున్నారు..? అసలు చేరుతారా..లేదా అన్న అనుమానలు తలెత్తాయి. కానీ ఈ వార్తలకు చెక్ పెడుతూ.. గురువారం రాత్రి కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే.సురేంద్రన్ సమక్షంలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర అధ్యక్షుడు కే.సురేంద్రన్ విజయ్ యాత్ర పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం నాడు చంగరాంకులంలో ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే మెట్రోమ్యాన్ శ్రీధరన్కు పూలమాల వేసి ఆహ్వానించారు. బీజేపీలోకి ఆహ్వానించినందుకు సురేంద్రన్కు ధన్యవాదాలు తెల్పుతూ.. బీజేపీలో చేరడమనేది నా జీవితంలో మరచిపోలేని ఘట్టాల్లో ఒకటంటూ శ్రీధరన్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను కూడా పోటిచేసేందుకు రెడీగా ఉన్నట్లు వెల్లడించారు.