అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో సోదరుడు, కన్నతండ్రిని కళ్లముందే పోగొట్టుకున్న దురదృష్టవంతుడు యశ్ వ్యాస్ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిందే.
2008 జులై 26. అప్పుడు యశ్ కు 8 ఏళ్లు. 11 ఏళ్ల సోదరుడు రోహన్, తండ్రి దుష్యంత్ వ్యాస్ తో కలిసి సైకిల్ నేర్చుకోవడం కోసం బయటికొచ్చారు. రెండు మూడు గంటలపాటు సైకిల్ తొక్కారు. రాత్రి ఏడున్నర ప్రాంతంలో తండ్రికి ఓ వ్యక్తి ఫోన్ చేసి సివిల్ ఆస్పత్రి దగ్గరకు రమ్మన్నారు. అదే ఆస్పత్రిలో కేన్సర్ డిపార్ట్ మెంట్ లేబోరేటరీలో పనిచేసేవాడు దుష్యంత్. దీంతో పిల్లలిద్దర్నీ తీసుకుని వెళ్లాడాయన. ముగ్గురూ అక్కడ ఉండగానే ఓ ఆంబులెన్స్ వచ్చింది, ఆ వెంటనే పేలుడు. పేలుడు ఆంబులెన్సులోనా, లేక వాహనం బయటనా అన్నది యశ్ కు తెలీదు. కానీ శక్తిమంతమైన పేలుడు. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించేంత. యశ్ కు కాస్త దూరంలో ఉన్న అతని సోదరుడు క్షణాల్లో గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాడు. దుష్యంత్ ను కొందరు వేగంగా ఆస్పత్రి లోపలకు తీసుకెళ్తున్నారు. యశ్ కు భయంవేసి ఇంటివైపు పరుగెత్తసాగాడు. తనకూ గాయాలైన విషయాన్ని అతడు మర్చిపోయాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తిని యశ్ ను ఆస్పత్రిలోకి తీసుకెళ్లాడు.ఆ రోజు గంట వ్యవధిలో 21 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే.
రాత్రి ఎనిమిదిన్నరకు యశ్ ఆస్పత్రిలో చివరి సారి తన తండ్రిని చూశాడు. స్ట్రెచర్ పై అచేతనంగా ఉన్నాడు. మరో స్ట్రెచర్ పై ఉన్న యశ్ కూడా కాసేపటికే స్పృహ కోల్పోయాడు. తన సోదరుడు అక్కడే తీవ్రగాయాలతో చనిపోయాడని అతనికప్పుడు తెలీదు. దుష్యంత్ వ్యాస్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని …తీవ్రంగా రక్తస్రావం అవడంతో ఆయన చనిపోయినట్టు కాసేపటికే వైద్యులు చెప్పారు.
ఆసమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ… వరుస బాంబు పేలుళ్ల గురించి తెలిసి దిగ్భ్రాంతి చెందారు. అందరికీ మెరుగైన చికిత్స అందిస్తానని చెప్పారు. ప్రపంచంలో ఏ ఆస్పత్రిలోనైనా చేర్పించి బతికించేందుకు సిద్దంగా ఉందని మోదీ అన్న విషయాన్ని తాను మరిచిపోలేనని యశ్ చెబుతున్నాడు. మూడునెలలపాటు అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి ఐసీయూలోనే ఉన్న యశ్ ను తరువాత అపోలో ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడా దాదాపు నెల రోజులున్నాడు.
అపోలోలో తనకు చికిత్స అందించిన శ్రీకాంత్ లగ్వాంకర్, డాక్టర్ జ్యోతీంద్ర కౌర్ తననెంతో జాగ్రత్తగా చూసుకున్న విషయం ఇన్నేళ్లకూ గుర్తుచేసుకుంటాడు యశ్. నాడు రాష్ట్రప్రభుత్వం యశ్ చికిత్స కోసం కోటీ 62 లక్షలు ఖర్చు చేసింది.మరికొంత పరిహారం కూడా అందించింది.
నాటి చిన్నారి యశ్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యాడు. త్వరలో మాస్టర్స్ లో చేరనున్నాడు. రెండు రోజుల క్రితం నాటి ఘటనలో దోషులకు శిక్షపడడంపై యశ్ స్పందించాడు. తన తండ్రి, సోదరుడు సహా అమాయకులనెందరినో అకారణంగా పొట్టనపెట్టుకున్న దుర్మార్గులకు సరైన శిక్షే పడిందంటున్నాడు. కొందరికి జీవితఖైదు వేశారనివారికీ ఉరిశిక్షే సరైందని అంటున్నాడు.
న్యాయం జరిగినందుకు తృప్తిగానే ఉన్నా ఇందుకోసం ఇంతకాలం వేచి చూడాల్సి వచ్చిందని యశ్ అన్నాడు. భర్త, మరో కన్నబిడ్డను ఒకేసారి కోల్పోయిన తన తల్లికి, అమ్మమ్మకు ఈ చిన్నారే ఆసరా అయ్యాడిప్పుడు. కళ్లముందే అన్న చనిపోయాడు, తండ్రి రక్తమోడుతూ నరకం అనుభవిస్తూ మృత్యుఒడి చేరాడు. ఎవరు ఎందుకు ఆ దారుణానికి పాల్పడ్డాడో ఆ చిన్నారికి అప్పుడు తెలీదు. పగలు, ప్రతీకారం వంటి పదాలు, వాటికి అర్థాలు తెలీదు. పెద్దయ్యాక తెలిసినా ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో వేచిచూస్తూనే 15 ఏళ్లుగా తల్లిని చూసుకుంటూ తన చదువు కొనసాగించాడు. డిగ్రీ పూర్తిచేశారు. కెమిస్ట్రీలో మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు.
అయితే ఈ దేశంలోని మీడియాకు యశ్ లాంటి వాళ్లు పట్టరు. కానీ ఉగ్రవాదిగా మారి… రాక్షసుడిలా అమాయకుల రక్తం తాగిన బుర్హన్ వనీ వంటి వాళ్లు మాత్రం కనిపిస్తారు. ఈ లిబరల్స్, సెక్యులర్ మేధావులైతే ఎగబడి మరీ బుర్హన్ వనీ వంటి వారిని పొగుడుతారు. కానీ యశ్ ఆత్మనిబ్బరతను పొగడరు. అతని వేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు.
ఎంతో తెలివైన పిల్లాడు అసలు లక్ష్యాన్ని వదిలి దారితప్పితే ఎలా ఉంటుందో బుర్హన్ వనీని ఉదాహరణగా చెప్పవచ్చు. అందుకు విరుద్ధంగా కళ్లముందే తనవాళ్లు చేయని తప్పునకు బలైనా ఎన్నడూ ఆవేశపడలేదు. ఓపికగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే తన లక్ష్యంవైపు పరుగెడుతున్నాడు యశ్.
ఓ కాలేజీ ప్రిన్సిపల్ కడుపున పుట్టి. ఎన్నో తెలివితేటలుండి 20 ఏళ్ల లేత వయసులోనే కరడుగట్టిన ఉగ్రవాదిగా మారాడు వనీ. అతి చిన్నవయసులో ఇంటిపెద్ద దూరమైన స్థితిలో కన్నతల్లికి ఆసరాగా నిలబడ్డాడు ఈ యశ్. వనీ తండ్రి అతన్ని బాధ్యతగానే పెంచాలనుకున్నాడు. కానీ ఉగ్రవాదభావజాలంవైపు మళ్లి… కశ్మీర్లో కల్లోలానికి కారకుడై…చివరకు ఎన్ కౌంటర్లో దిక్కులేని చావు చచ్చాడు వనీ. విద్యాబుద్ధులు నేర్పించే తొలిగురువు తండ్రి దూరమైనా తల్లి ఆలనపాలనలో బాధ్యత గల పౌరుడిగా తనను తాను తీర్చి దిద్దుకున్నాడు యశ్.
బుర్హన్ వనీ ఎన్ కౌంటర్లో హతమయ్యాక కశ్మీర్లో చెలరేగిన అల్లర్ల గురించీ మనకు తెలుసు. దేశంలోని తుక్డే గ్యాంగ్ అతన్ని హీరోగా అభివర్ణిస్తూ…ఓ వర్గం మీడియా సైతం అతన్ని అమరుడిగా చిత్రీకరించిన సంగతీ మనం మరువలేం. జమ్ముకశ్మీర్లో యువత బుర్హన్ వనీలా కాకూడదని, వారిని సన్మార్గంలో నడిపించేలా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా భారత ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది. కానీ ఆ కథనాలు ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి ఎందుకో మన దేశ మీడియాకు మనసొప్పదు. బుర్హన్ వనీ అంత్యక్రియలకు లక్షలాదిగా హాజరయ్యాడని..అతను అమరుడని కీర్తించిన ఆ మీడియాకు గానీ, లౌకికవాదులం అని చెప్పుకునే వాళ్లకు కానీ ఈ యశ్ ఎందుకో కనిపించడం లేదు.
బుర్ఙన్ వనీని హీరోగా కీర్తిస్తూ ప్రముఖ బాలీవుడ్ స్టార్ తో ఎవరైనా సినిమా తీసినా ఆశ్చర్యం లేదు. వ్యక్తుల హక్కుల కోసం పోరాడిన హీరోలుగా వారిని రీల్లోనూ చూపిస్తున్నారు. 1993లో ముంబై పేలుళ్లకోసం పేలుడు పదార్థాలు సరఫరా చేసి 2004లో ఎన్ కౌంటర్లో హతమైన ఉగ్రవాది అబ్దుల్ లతీఫ్ జీవిత చరిత్రను తీసిన ఘనులు మనకున్నారు. RAEES పేరుతో షారుఖ్ ఖాన్ పెట్టి తీసిన సినిమా కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో ఆ పేలుళ్లలో రెండు చేతులూ కోల్పోయిన డాక్టర్ మాళవికా అయ్యర్ గురించి ఈ ప్రపంచంలో తెలిసింది చాలా తక్కువమందికి. నాడు 13 ఏళ్ల మాళవిక తరువాత కష్టపడి కసితో డాక్టర్ అయింది. ఆమె గురించి రాయడానికి మీడియాకు గానీ, ఆమె జీవితగాథను తీసేందుకు సినిమావాళ్లకు కానీ మనసు రాదు.
తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ మాళవిక కూర్చుని ఏడవలేదు. వైకల్యాన్ని జయించింది ఎందరికో ప్రేరణగా నిలిచింది. ప్రతీకారం తీర్చుకోవాలని..తాను నేరస్తుడిగా మారాలని యశ్ అనుకోలేదు. బిన్ లాడెన్, బుర్హన్ వనీ, అబ్దుల్ లతీఫ్ వంటి వాళ్లు క్రూరులు, రక్తం రుచిమరిగిన రాక్షసులు. కానీ లిబరల్స్ కు, సోకాల్డ్ లుటియన్స్ మీడియా, మాఫియాతో అంటకాగుతూ బాలీవుడ్ ను ఏలుతున్న కొందరు దుర్మార్గులకు ఉగ్రవాదులే హీరోలు.