ముంబై డాక్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. భారత నౌకాదళానికి చెందిన డెస్ట్రాయర్ షిప్ …ఐఎన్ఎస్ రణవీర్లో జరిగిన పేలుడులో ముగ్గురు సిబ్బంది చనిపోయారు. 2021 నుంచి తూర్పు నావికా దళంలో విధులు నిర్వర్తిస్తోంది రణవీర్. కొన్నిరోజుల్లో బేస్ పోర్టుకు రావల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. షిప్ లోని ఇంటర్నల్ కంపార్ట్ మెంట్లో పేలుడు జరిగినట్టు గుర్తించారు. ముగ్గురు ప్రాణాలు పోవడం దురదృష్టకరమని.. ప్రమాదంలో పెద్దగా వస్తు నష్టం జరగలేదని డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటన విడుదల చేసింది. మంటలు మొదలైన క్షణాల్లోనే సిబ్బంది అప్రమత్తమై అదుపులోకి తెచ్చారని పేర్కొంది.
మంగళవారం సాయంత్రం నాలుగున్నరకు పేలుడు జరిగిందని… అయితే అందులో ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రి లేదని.. పేలుళ్లకు కారణాలు తేల్చేందుకు బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
INS రణ్వీర్, రణ్వీర్ క్లాస్ డెస్ట్రాయర్ లలో మొదటిది, ఏప్రిల్ 21, 1986న భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. రష్యా నుంచి వీటిని భారత్ దిగుమతి చేసుకుంది. జలాంతర్గాములు, తక్కువ-ఎగిరే విమానాలు , క్రూయిజ్ క్షిపణులకు వ్యతిరేకంగా పనిచేసే …క్యారియర్ టాస్క్ ఫోర్స్ రక్షణ కోసం యాంటీ-ఎయిర్క్రాఫ్ట్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వంటి రక్షణ వ్యవస్థ ఐఎన్ఎస్ రణవీర్లో ఉంటుంది. ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ తన కెరీర్ మొదట్లో రణవీర్ కు నాయకత్వం వహించారు.
అటు INS రన్వీర్లో జరిగన ప్రమాదంలో చనిపోయిన మాస్టర్ చీఫ్ పీటీ ఆఫీసర్లు క్రిషన్ కుమార్, సురీందర్ కుమార్ , AK సింగ్ కు నివాళి అర్పిస్తూ వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలుపుతూ ఈ క్లిష్టసమయంలో మేం పూర్తిగా అండగా ఉంటామంటూ భారత నావికాదళం ప్రకటన విడుదల చేసింది.