ఆరు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలతో రాజ్యసభలో బీజేపీ బలం 100కు చేరుకుంది. 1988 తర్వాత రాజ్యసభలో 100 సీట్ల మార్కును దాటిన తొలి పార్టీగా బీజేపీ నిలిచింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం నాలుగు స్థానాల్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. నాగాలాండ్, అస్సాం, త్రిపురలలో మొత్తం స్థానాలు ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ స్థానాన్ని పార్టీ గెలుచుకుంది. పంజాబ్లో భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు రాజ్యసభ స్థానాలను ఏకపక్షంగా కైవసం చేసుకుంది. రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్, సంజీవ్ అరోరా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
కేరళలోని మూడు స్థానాల్లో అధికార ఎల్డీఎఫ్ రెండు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎల్డీఎఫ్ తరపున డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎఎ రహీమ్, సీపీఐ కన్నూర్ జిల్లా కార్యదర్శి పి సంతోష్ కుమార్, ప్రతిపక్షాల తరపున కేరళ మహిళా కాంగ్రెస్ చీఫ్ జేబీ మాథర్ ఎన్నికయ్యారు. త్రిపుర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ మాణిక్ సాహా 40 ఓట్లతో రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానానికి ఎన్నికయ్యారు, అతని ప్రత్యర్థి అభ్యర్థి, సీపీఐ(ఎం) అభ్యర్థి భాను లాల్ సాహాకు కేవలం 15 ఓట్లు మాత్రమే వచ్చాయి. అధికార బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణంలోని ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)కి చెందిన ఎమ్మెల్యే ఓటు వేయలేదు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తగిన బలం లేక కాంగ్రెస్ అభ్యర్థినే పెట్టలేదు. దీంతో హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్సి కిందర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాండ్లో BJP నాయకురాలు పాంగ్ నోన్ కొన్యాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడినుంచి మొదటిసారి రాజ్యసభకు నామినేట్ అయిన మహిళానాయకురాలిగా ఆమె రికార్డు సృష్టించారు.
ఇక అసోంలో అనూహ్యంగా రెండోస్థానాన్నీ దక్కించుకుంది బీజేపీ. అక్కడి రెండు రాజ్యసభ స్థానాల కోసం ఓటింగ్ జరిగింది. ఓ సీటును బీజేపీ అభ్యర్థి పవిత్ర మార్గేరీటా ఏకపక్షంగా దక్కించుకోగా.. రెండో సీటుకోసం రసవత్తర రాజకీయం సాగింది. బీజేపీనుంచి నర్జారీ రెండో సీటు కోసం పోటీపడగా క్రాస్ ఓటింగ్ జరిగి ఆమెనెగ్గారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. గతంలో కాంగ్రెస్ నేత. 2015లో ఆయన బీజేపీలో చేరారు. ఈ కారణంగా.. పాత పరిచయాలను ఆసరాగా చేసుకుని ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ప్రతిపక్ష కూటమి ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేసింది కాంగ్రెస్.
ఎన్నికలు జరిగిన మొత్తం 13 స్థానాల్లో ఆప్, బీజేపీ ఐదేసీ స్థానాలు, ఎల్డీఎఫ్ రెండు, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)