గుజరాత్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. బోణి కొట్టిన ఎంఐఎం.
ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో బీజేపీ హవా కొనసాగుతోంది. దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా గుజరాత్లో బీజేపీ జెండా రెపరెపలాడుతోంది. తాజాగా మరోసారి కూడా రాష్ట్రంలో కమల విజయం అక్కడ పార్టీ ఎంత బలంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తోంది. ఈ నెల 21వ తేదీన రాష్ట్రంలో ఆరు మునిసిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అహ్మదాబాద్లో 192 స్థానాలకు, రాజ్కోట్లో 72, జామ్నగర్లో 64, భావ్నగర్లో 52, వడోదరలో 76, సూరత్లో 120 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 576 స్థానాల్లో 483 స్థానాల్లో బీజేపీ విజయాన్ని సాధించి.. ఆరు మునిసిపల్ కార్పోరేషన్లలోనూ బీజేపీ జెండా ఎగరవేసింది. ఇక కాంగ్రెస్ 55 స్థానాల్లో గెలుపొందగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎంఐఎం 7, బీఎస్పీ 3 స్థానాల్లో గెలుపొందగా.. ఒకచోట స్వతంత్ర్య అభ్యర్ధి గెలుపొందారు.
కాగా.. తమకు భారీ విజయాన్నిందించినందుకు సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీసీఎం నితిన్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సీఎం,డిప్యూటీ సీఎంలను అభినందించారు. ప్రధాన నరేంద్ర మోదీ కూడా తన ట్విట్టర్లో ఎన్నికల విజయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఫలితాలు ఎంతో ప్రత్యేకమైనవంటూ పేర్కొన్నారు.
ఎంఐఎం బోణి..
ఇక ఎప్పటినుంచో గుజరాత్లో పాగా వేయాలనుకుంటున్న హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ ఈసారి గుజరాత్లో బోణీ కొట్టింది. మొత్తం 7 స్థానాల్లో తమ అభ్యర్ధులను గెలిపించుకోగలిగింది.