లోక్ సభలో బీజేపీ మొట్టమొదటి ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. 87 ఏళ్ల ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు.
బీజేపీ పార్టీ ఆవిర్భవించిన తరువాత 1984లో ఆ పార్టీ ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎంపీల్లో జంగారెడ్డి ఒకరు. అప్పుడాయన హన్మకొండ నియోజకవర్గం నుంచి గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుపై 54 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక నాయకుడాయన. వాజ్పేయ్, అద్వానీ, జోషి వంటి బీజేపీ అగ్రనాయకులు పరాజయం పాలయినా జంగారెడ్డి విజయం సాధించారు.
నవంబర్ 18 1935లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో జగ్గారెడ్డి జన్మించారు. జన సంఘ్ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తెలంగాణ సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అతను 1967-72, 1978-83 ,1983-84 లలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఎందరినో తీర్చిదిద్దారు జంగారెడ్డి. జంగారెడ్డికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కోడలు చందుపట్ల కీర్తిరెడ్డి బీజేపీ క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తున్నారు. గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి నామమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న జంగారెడ్డి అవినీతి మరక అంటని నాయకుడిగా, జనం మనిషిగా పేరు తెచ్చుకున్నారు.
జగ్గారెడ్డి భౌతికకాయాన్ని అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం కొద్దిసేపు పార్టీ కార్యాలయంలో ఉంచి.. అనంతరం హన్మకొండకు తరలించారు. సాయంత్రం హన్మకొండలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
జంగారెడ్డి మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు సంతాపం తెలిపారు. ఆయన ఆకస్మిక మృతి బాధించిందంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు.
శ్రీ సి జంగా రెడ్డి గారు భాజపా క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు సమర్థవంతమైన వాణిని అందించారు. ఆయన కుమారుడితో మాట్లాడి సంతాపం తెలపడం జరిగింది. ఓం శాంతి.
— Narendra Modi (@narendramodi) February 5, 2022
Shri C Janga Reddy Garu was an effective voice for the BJP at a very critical phase of the Party’s trajectory. Spoke to his son and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) February 5, 2022
బీజేపీ ప్రముఖ నాయకులు శ్రీ జంగారెడ్డి గారి హఠాణ్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 1984 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీకి ఉన్న ఇద్దరు ఎంపీలలో ఒకరిగా, పార్టీ పునాదులను బలోపేతం చేసేందుకు వారు కృషి చేశారు.
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఓం శాంతి 🙏🏻 https://t.co/jyJEzrdmY2
— G Kishan Reddy (@kishanreddybjp) February 5, 2022