బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం.. గో మూత్రం ఫినాయిల్ మాత్రమే ఉపయోగించాలని హుకూం..!
మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసేందుకు ఉపయోగించే ఫినాయిల్ ఏది వాడాలో అన్నదానిపై ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గోమూత్రంతో తయారు చేసిన ఫినాయిల్ను మాత్రమే ఉపయోగించాలని హుకూం జారీచేసింది. ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని జనరల్ అడ్మినిష్ట్రేషన్ విభాగం ఇటీవల ఓ ఉత్తర్వును కూడా విడుదల చేసింది. దీనిపై ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ కూడ స్పందించారు. గోమూత్రంతో తయారు చేసే ఫినాయిల్ కర్మాగారాలను ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించేందుకే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. దీంతో గో సంపద కూడా అభివృద్ధి చెందుతుందని.. రైతులకు గో ఆధారిత వ్యవసాయంతో పాటు అదనపు లాభాలను పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
కాగా, మధ్యప్రదేశ్ సర్కార్ గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గోశాలల్లోని 180,000 ఆవుల దాణా కోసం రూ.11 కోట్లు కేటాయించింది. దేశంలో మొట్టమొదటి గో అభయారణ్యం 2017లో మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వాలో స్థాపించారు.