బిజెపి ఆపరేషన్ సాగర్: జానాకు షాక్
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బిజెపి దూకుడుగా దూసుకుపోతున్నది. దుబ్బాకలో మాధవనేని రఘునందన్ రావు విజయం తర్వాత కమలనాథుల్లో ఉత్సాహం కదం తొక్కింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 సీట్లను గెలిచిన బిజెపి, అధికార టిఆర్ ఎస్ కు విజయం దక్కకుండా చేసింద. హంగ్ అనివార్యమైంది. కమలనాథులకు మేయర్ సీటు దక్కే అవకాశం లేకపోయినా కొత్త నగరంలో దాదాపు సగం డివిజన్లలో గెలవడం పెద్ విశేషం.
ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కూడా గెలిచి టిఆర్ ఎస్ ను మరింతగా దెబ్బకొట్టాలనేది బండి సంజయ్ టీమ్ ప్లాన్. ఇందుకు అనుగుణంగానే ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. శుక్రవారం సూర్యాపేటలో భారీగానే చేరికలు జరిగాయి. కాంగ్రెస్ బ్లాక్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి ముఖ్య అనుచరుడు ఇంద్రసేనా రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఇది చాలా పెద్ద విశేషం. జానారెడ్డికి ఇది కచ్చితంగా షాక్ వంటిదే అంటున్నారు పరిశీలకులు. ఇంద్రసేనా రెడ్డి వంటి వారి కృషి ఫలితంగానే జానారెడ్డి చాలా సార్లు గెలిచారు. మళ్లీ ఆయనే పోటీకి సిద్ధపడుతున్నారు. అంటే అనుచరులు అనుచరులుగానే ఉండిపోవాలా అనే ప్రశ్న మొదలైంది. అలాగే మరి కొన్ని విషయాల్లోనూ సాగర్ కాంగ్రెస్ ల లుకలుకలున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో జానా శిబిరాన్ని మరింత బలహీన పరచడానికి బిజెపి ప్రయత్నించ వచ్చు. టిఆర్ ఎస్ ను ఓడిస్తాం, సత్తా చాటుతాం అంటూ ఇప్పటికే ఇద్దరు నాయకులు బిజెపి టికెట్ వేటలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరికి టికెట్ వచ్చినా వాళ్లు చేసే ప్రచారం బిజెపికే ఉపయోగ పడుతుందన్న మాట.