వ్యవసాయ చట్టాలపై బిజెపి వ్యూహాత్మక తప్పిదం?
భారతదేశానికి స్వాతంత్ర్యం 1947లో వస్తే, ఈ దేశ రైతులకు నిజమైన స్వతంత్రం 2020లో వచ్చింది. ఇది నిజం. మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. పండించిన పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇంతకాలానికి లభించింది. పైగా కాంట్రాక్ట్ సాగులో రైతుల హక్కులను కాపాడటానికి తగిన రక్షణలు కూడా ఈ చట్టాల్లో ఉన్నాయి. ఏ రకంగా చూసినా మోడీ ప్రభుత్వానికి జేజేలే పలకాల్సిన చర్యలివి. పంజాబ్ లో కొందరు మినహా దేశ వ్యాప్తంగా రైతులందరూ మోడీ చట్టాలను శభాష్ అంటున్నారు. కానీ కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పంజాబ్ కు చెందిన వందల మంది రైతులం అని చెప్పుకొంటూ ట్రాక్టర్లమీద ఢిల్లీపై దండయాత్రచేశారు. పైగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ చట్టాలను రద్దు చేయాలని ఎంతో మంది అవార్డ్ వాపసీకి సిద్ధపడ్డారు. కానీ ఈ చట్టాలకు అనుకూలంగా ఒక్క పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు కాలేదు. కనీసం సంఘ్ పరివార్ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ కూడా ఈ చట్టాలను కొనసాగించాలంటే సుప్రీంకోర్టులో పిటిఫన్ వేయకపోవడం ఆశ్చర్యకరం.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సోమవారం నాడు ఇదే అంశం ప్రస్తావించారు. ఈ చట్టాలకు అనుకూలంగా తమ ముందు ఒక్క పిటిషన్ కూడా లేదన్నారు. బిజెపిలో పెద్ద పెద్ద పదవులు పొందిన వాళ్లలో చాలా మంది న్యాయవాదులే. వాళ్లు గానీ, వారికి మద్దతు పలికే వారు గానీ ఏ ఒక్కరూ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదు అని ఈ చట్టాలను సమర్థించే రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు చాలా రాష్ట్రాల్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, ఇతర రాష్ట్రాల్లో ఈ చట్టాలకు అనుకూలంగా ప్రదర్శనలు లేదా సభలను ముమ్మరంగా నిర్వహించాలనే వ్యూహం కమలనాథులకు తట్టలేదా? న్యాయ పోరాటంలో గెలవాలంటే మన వాదనను బలంగా వినిపించాలి. కొన్ని విపక్షాలు అబద్ధాలను కూడా డంకా బజాయించి చెప్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యేలా చూశాయి. బిజెపి నాయకులు మాత్రం చట్టాలకు అనుకూలంగా తాము సైతం న్యాయపోరాటం చేయాలనే వ్యూహం గురించి ఆలోచించలేక పోయారు. ఇది వ్యూహాత్మక తప్పిదం అంటున్నారు పరిశీలకులు. కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, ధరణి వగైరా అంశాలపై తెలంగాణలో ధర్నాలు జరుగుతున్నాయి. మరో వైపు, కాంగ్రెస్ పార్టీ సాగు చట్టాలకు వ్యతిరేకంగ తెలంగాణ అంతటా ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ బిజెపి మాత్రం సాగు చట్టాలకు అనుకూలంగా ఒక ఉద్యమాన్ని నిర్మించడం అనేది ఎందుకు జరగలేదు? ఈ చట్టాలు ఉండాలి అని కోరుకునే రైతులు అడుగుతున్న ప్రశ్న ఇది.