వెస్ట్ బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇక్కడ హత్యారాజకీయాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీకి, బీజేపీకి మధ్య వార్ జరుగుతూ వస్తోంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా నాటు బాంబులతో దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ కార్యకర్తలపై నాటు బాంబులతో దాడులు జరిగగా.. తాజాగా.. బీజేపీకి చెందిన ఎంపీ ఇంటిపై దుండగులు నాటు బాంబులతో దాడులకు పాల్పడ్డారు. నార్త్ 24 పరగణ జిల్లా భట్పారాలోని బరాక్పూర్ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా 15 చోట్ల నాటు బాంబులతో దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఎంపీ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా దుండగులు ధ్వంసం చేశారు. ముగ్గురు దుండగులు బాంబులతో దాడికి పాల్పడినట్లు ఎంపీ స్వయంగా ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటానా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు జరిగిన ఘటనపై ఈసీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ అర్జున్ సింగ్ తెలిపారు.