భారతదేశాన్ని పల్లెల దేశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ జనాభాలో అత్యధిక శాతం గ్రామాల్లో నివసిస్తుంటారు దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చిన తర్వాత 50, 60 ఏళ్ల పాటు పరిపాలన చేసిన ప్రభుత్వాలు .. గ్రామీణ ప్రజల్ని నిర్లక్ష్యం చేశాయి. ఇంకా చెప్పుకోవాలంటే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే విషయంలో శ్రద్ధ పెట్టలేదు. దీంతో కనీస వసతులు కూడా గ్రామాల్లో కనిపించని పరిస్థితి.
కానీ 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక పరిస్థితి లో మార్పు వచ్చింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గ్రామీణ ప్రజలపై దృష్టి సారించింది. అక్కడ ప్రజలకు వసతులు కల్పించినందుకు, జీవన ప్రమాణాలు పెంచేందుకు పెద్ద పేట వేసింది. మొదటి దఫా పరిపాలనలో స్వచ్ఛ భారత్ కు పెద్ద పీట వేయటం జరిగింది. దీని కింద గ్రామాల్లోని మురికిని వదిలించి, స్వచ్చత దిశగా ప్రస్థానం మొదలైంది. మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్దపీట వేయటం ద్వారా బహిరంగ మల విసర్జన నుంచి గ్రామాలు విముక్తి చెందాయి. చెరువులు, కుంటలు బాగు చేసుకోవటం ద్వారా వ్యవసాయానికి జల వనరులు అంతకంతకూ పెరిగాయి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయా కాలనీల్లో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపట్టి విజయం సాధించారు. డ్రైనేజీ వ్యవస్థకు ఆధునిక హంగులు తీర్చిదిద్దగలిగారు. పాఠశాలల్లో వసతులు కల్పించటంతో పాటు ఉపాధ్యాయుల సంఖ్యను విస్తారంగా పెంచారు. అటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా జవసత్వాలు కల్పించారు. జన ఔషధి వంటి కార్యక్రమాల ద్వారా చౌక ధరకే మందులను అందుబాటులోకి తెచ్చారు.
గ్రామాల్లో రైతులు రైతు కూలీలు ఎక్కువ మంది కనిపిస్తారు. అందుచేత
వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతాంగాన్ని ఆదుకొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వ్యవసాయదారులకు రక్షణ కల్పించగలిగారు. సుమారు రెండు కోట్ల 28 లక్షల మంది రైతులకు పంటల బీమా ను ప్రతీ ఏటా చౌకగా అందిస్తున్నారు. సుమారు 66 లక్షల పొలాల నుంచి శాంపిల్స్ తీసుకొని భూసార పరీక్షలు చేయించి, వ్యవసాయంలో రైతులకు మార్గదర్శనం చేయించారు. అటు ఉద్యానవన పంటల విషయంలో పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. పశువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ, రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తున్నారు. వ్యవసాయదారుల మౌళిక వసతుల కోసం సుమారు 58వేల కోట్ల రూపాయిలను అందించి ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించగలిగారు. అటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతీ రైతుకి ఏడాదికి 6వేల రూపాయిల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
గ్రామీణ ప్రజలకు ఆదాయం పెరిగితేనే జీవితాలు బాగుపడతాయి. ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తోంది.
గ్రామాల్లో పేద ప్రజానీకానికి ఉపాధి కల్పించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. సుమారు 12 కోట్ల 89 లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ కుటుంబాల్ని ఆదుకొంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నది దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో విజయవంతం అయిన పథకం. దీని కింద సుమారు 2 కోట్ల 94 లక్షల కుటుంబాలు ఇళ్లను నిర్మించుకోగలిగాయి. పేద మధ్య తరగతి ప్రజల స్వప్నం అయిన ఇంటి కలను సాకారం చేయగలిగారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్ల 11 లక్షల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం కలిగించారు. 2 లక్షల 69వేల గ్రామ పంచాయతీల్లో మిషన్ అంత్యోదయను విజయవంతంగా అమలు చేయగలిగారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక అద్భుతాలు చేసింది. అందులో మొదటిగా చెప్పుకో తగినది ..రోడ్ల నిర్మాణం . దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులను అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రామాల్లోని రోడ్లను కలుపుతూ 7 లక్షల 60వేల కిలోమీటర్ల మేర ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన్ ద్వారా రహదారుల్ని నిర్మించారు. కుటుంబాల్లో ఆర్థిక స్థోమతను పెంచేందుకు గాను క్రమం తప్పకుండా 3 కోట్ల 57 లక్షల మందికి పింఛన్లను అందిస్తున్నారు. దీని ద్వారా వ్రద్దులు, వితంతువులు, వికలాంగులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోంది. ఇటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దేశంలో ముందెన్నడూ జరగని విధంగా నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కింద సుమారు 16 లక్షల మంది గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ అందించి కుటుంబాలను నిలబెట్టారు. 49 లక్షల 31వేల మంది యువత కు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి జీవితాల్లో వెలుగులు నింపగలిగారు. అంటే సుమారు 50లక్షల కుటుంబాలకు చేయూత అందించినట్లు అన్న మాట.
మొత్తంగా చెప్పాలంటే 10 ఏళ్ల కాలంలో గ్రామాల రూపురేఖల్ని చాలావరకు మార్చగలిగారు. అంత మాత్రం చేత ..పూర్తిగా పరిస్థితులు బాగుపడ్డాయి అని అనుకోడానికి లేదు. గ్రామాల్లో నాణ్యమైన జీవన ప్రమాణాలు ఏర్పడాలంటే చేయాల్సింది చాలా ఉంది . గ్రామాల్లో వెలుగులు నింపుతున్న ఎన్డీఏ ప్రభుత్వం వైపు చాలామంది గ్రామీణ ప్రజలు నిలుస్తున్నారు . దీనిని దృష్టిలో ఉంచుకుని, ఈ విషయంలో ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.