అన్నామలై పనితీరు, పోరాటాలతో తమిళనాడు బీజేపీలో రోజురోజుకూ జోష్ పెరుగుతోంది. ఇక ఆర్ఎస్ఎస్ తలపెట్టిన రూట్ మార్చ్ లకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 45 ప్రాంతాల్లో కవాతులను సంఘ్ ప్లాన్ చేసింది. ఈమేరకు బందోబస్తు ఏర్పాట్లకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సైతం సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు రాష్ట్రముఖ్యమంత్రికి ఏమాత్రం మింగుడుపడడం లేదు. కాగలకార్యం గంధర్వులే తీర్చారన్నట్టు చీలికలు, పేలికలతో అన్నాడీఎంకే కథముగిసింది, ఇక తనకు తిరుగులేదని స్టాలిన్ మురుస్తున్న వేళ అన్నామలై తెరపైకి వచ్చారు. కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు.
ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకుని బీజేపీలో చేరిన ఆయనకు పార్టీ వెంటనే పగ్గాలు అప్పగించింది. అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ముచేయకుండా మరుక్షణం నుంచే పనిలో పడ్డారు అన్నామలై. తమిళనాడు వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ జనం మద్దతు కూడగడుతున్నారు. ఇక తాజాగా డీఎంకే ఫైల్స్ పేరిట ఆ పార్టీ నాయకులు, కరుణానిధి కుటుంబసభ్యులు, వారి అనుచరుల అక్రమఆస్తుల వివరాలను బయటపెడుతున్నారు. పార్ట్ వన్ అంటూ నిన్ననే ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ఇంకా కొనసాగుంతుందనీ ప్రకటించారు. తరువాత అన్నాడీఎంకే నాయకుల అవినీతి, అక్రమాల బాగోతాన్ని బయటపెడతానని ప్రకటించారు. అయితే అన్నామలై కేవలం ప్రత్యర్థి పార్టీలమీదనే యుద్ధం చేయడం లేదు. బీజేపీ పెద్దలతోనూ ఆయన పోరాటం చేస్తున్నారు. ఇది నిజం. ఇటీవలే ఆయన చేసిన ఓ ప్రకటన ఆషామాషీదేం కాదు. AIDMK నాయకులని అధిష్టానం కనుక పార్టీ లోకి ఆహ్వానిస్తే తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చేసిన ప్రకటన సంచలనం అయింది. ఈ ప్రభావం అన్నామలైమీద పడుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. అన్నామలై ప్రకటనను సీరియస్ గానే తీసుకున్న పార్టీ డిల్లీ పెద్దలు అన్నామలై లాగా తాము ద్రవిడ రాజకీయాల్ని అర్థం చేసుకోలేకపోయామని గ్రహించి వెనక్కి తగ్గారని చెబుతున్నారు. అంతేకాదు ఆయనకు ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పవచ్చు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కమిటీలో ఆయన్ని కూడా వేయడం గమనార్హం. అన్నామలై కర్నాటక కేడర్ ఐపీఎస్ గా పనిచేశారు. ఆయనకు కర్నాటక చాలా ప్రాంతాలతో, ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. అందుకే అక్కడి ఎన్నికల్లోనూ ఆయన సేవలు వినియోగించుకుంటోంది పార్టీ.
ఇక తాజాగా డీఎంకే నాయకుల ఆస్తుల వివరాలు బయటపెడుతున్న అన్నామలై తరువాత అన్నాడీఎంకే నాయకుల వంతని ప్రకటించారు.. ఓ జాతీయ పార్టీ రాష్ట్ర చీఫ్ గా దశాబ్దాలుగా పాతుకుపోయిన రెండు ద్రవిడ పార్టీలను ఆయన ఒకేసారి ఢీ కొంటున్నారు. అందుకే AIDMK నాయకులని తీసుకోవద్దని హైకమాండ్ కు నేరుగా చెప్పేశారు. తమిళనాడు వరకు పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను అన్నామలైకే వదిలేస్తూ మరింత స్వేచ్ఛ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు కనిపిస్తోంది.