బీజేపీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది.. రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ తమకు బలమైన శత్రువంటూ వర్ణిస్తూ.. అంతకంటే పెద్ద శత్రువైన బ్రిటీషర్లను తరిమిన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యానించారు. అయితే నరేంద్ర మోదీని కూడా అహింసా మార్గంలోనే ఓడిస్తామని ప్రకటించారు. తమిళనాడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఆదివారం నాడు తిరునల్వేలి జిల్లా పాళయంకోట క్సేవియర్ కాలేజీలో పలువురు విద్యావేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలకుల కంటే నరేంద్ర మోదీ బలమైన వ్యక్తి కాదన్నారు. బ్రిటీషర్లను భారత ప్రజలు దేశం నుంచి తరిమికొట్టారంటూ పేర్కొన్న రాహుల్.. మోదీని కూడా నాగ్పూర్కు తరిమికొడతారంటూ వ్యాఖ్యానించారు.
ఇక కేంద్రంలోని బీజేపీ సర్కార్.. హిందుత్వానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు ఉంటుంది కానీ.. ఆచరణలో మాత్రం హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించారు. హిందూ ధర్మం శాంతి సామరస్యతను కోరుకుంటుందని.. కానీ బీజేపీ అలా కాదన్నారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త విద్యావిధానం పూర్తి అధికారాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకునేలా ఉందని.. ఇది దేశ విద్యా వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. విద్యను మతపరంగా మార్చేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందన్నారు.