బిజెపి ప్రభుత్వం తెచ్చిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ను నమ్మను, వేసుకోను అంటున్నారు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా టీకా వేయిస్తారట. అంటే వ్యాక్సిన్ అనేది సమాజ్ వాదీ పార్టీ ఆఫీసులో తయారవుతుందా?
బిజెపి ప్రభుత్వం తెచ్చిన టీకా వద్దంటున్నారు మరి ఆ ప్రభుత్వం ఖజానా నుంచి ఇచ్చే పింఛన్, ఇతర భత్యాలు ఎందుకు తీసుకుంటున్నారు? సెక్యూరిటీ ఎందుకు పొందుతున్నారు? అది ప్రజాధనం అంటారేమో. నిజమే. వ్యాక్సిన్ కూడా ప్రజాధనంతోనే తయారైంది. ప్రజాధనం నుంచి వేతనాలు తీసుకునే డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలే వ్యాక్సిన్ వేస్తారు. ఇందులో రాజకీయ పార్టీల ప్రస్తావన అనవసరం.
గత ఆరేళ్లుగా యూపీలో కనీ వినీ ఎరుగని అభివృద్ధి జరుగుతోంది. జాతీయ రహదారుల నిర్మాణం భారీగా జరిగింది. అదంతా బిజెపి సర్కారు ఘనత. మరి ఆ రోడ్లమీద అఖిలేష్ యాదవ్ తిరగడం లేదా? బిజెపి ప్రభుత్వం వేసిన రోడ్లని ఇంట్లోనే కూర్చుంటున్నారా? బిజెపి సర్కార్ సరఫరా నీళ్లు, విద్యుత్తు వంటి వాటిని ఇంట్లో కూడా వాడటం లేదా? వితండ వాడానికి కూడా ఒక హద్దుండాలి. ఆయన ప్రభుత్వం వచ్చే వరకు ప్రజలు వ్యాక్సిన్ వేసుకోకూడదా? అసలు ఆ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందనే గ్యారంటీ ఎవరిస్తారు? వచ్చే ఎన్నికల్లో కూడా ఎస్పీ ఓడిపోతే ప్రజలు మరికొన్ని సంవత్సరాలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూడాలా? బుజ్జగింపు రాజకీయ పైత్యం ప్రకోపించిన ఎస్పీకి ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కీలెరిగి వాత పెట్టారు. అయినా అదే వరస. ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పే వరకూ ఇంతేనేమో.