బీజేపీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దేశంకోసం బీజేపీ ఒక్క కుక్కను కూడా కోల్పోలేదంటూ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మల్లికార్జున ఖర్గే సోమవారంనాడు రాజస్థాన్లోని ఆల్వార్లో జరిగిన భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ర్యాలీలో ఈ మాటలన్నారు. దేశం కోసం ముందునుంచీ కాంగ్రెస్ నిలబడిందని, స్వాతంత్ర్య సముపార్జనకు పాటుపడిందనీ అంటూ… ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగక …. ”బీజేపీ దేశం కోసం కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదు. అయినా సరే తామే దేశభక్తులమని చెబుతుంటారు అని విమర్శించారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.