ఉత్తర ప్రదేశ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది అధికార బీజేపీ. 36 సీట్లలో ఏకంగా 33 యోగీ టీం వశమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా-నేనా అన్నట్టు బీజేపీతో తలపడిన సమాజ్వాదీ పార్టీ మండలి పోరులో మాత్రం పూర్తిగా చతికిలపడింది.
కనీసం బోణీ కొట్టలేని పరిస్థితి. బీజేపీ కాక మిగిలిన 3 సీట్లు ఇండిపెండెట్లు సాధించడం విశేషం. అయితే ప్రధాని సొంత నియోజకవర్గంలో బీజేపీకి పెద్దషాకే తగిలింది. వారణాశిని ఆ పార్టీ కోల్పోయింది. జైలులో ఉన్న మాఫియా డాన్ బ్రిజేష్ సింగ్ కుటుంబం మరోసారి అక్కడ తమ పట్టు చాటుకుంది. బ్రిజేష్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. సమాజ్వాదీ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది.
బీజేపీ అభ్యర్థులు ఘాజిపూర్, మీరట్, ఘజియాబాద్, ఫతేపూర్-కాన్పూర్, లక్నో, సీతాపూర్, ఉన్నావో, రాయబరేలి, జౌన్పూర్, బహరైచ్, గోరఖ్పూర్, గోండా, బల్లియా, ఫరూఖాబాద్, ఝాన్సీ-లలిత్పూర్-జలౌన్, ప్రయాగ్రాజ్-కౌషంబి, పిలిభిత్-షాజహాన్పూర్లలో గెలుపొందారు. వారణాసి, ప్రతాప్గఢ్, అజంగఢ్ సీట్లను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. కాగా, బీజేపీ 9 స్థానాల్లో పోటీ లేకుండానే గెలిచింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)