మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తన తండ్రిని మోసం చేసిందని వ్యాఖ్యానించారు. మరాఠీ దినపత్రిక ‘లోక్సత్తా’ నిర్వహించిన కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. శివసేన వ్యవస్థాపకుడైన తన తండ్రిని మోసం చేయడాన్ని చూసిన తర్వాత, తాను “చాలా చాకచక్యంగా” వ్యవహరిస్తున్నానని, హిందుత్వం పేరుతో ఆడుతున్న “ఆటలను” అంగీకరించలేనని ఉద్ధవ్ అన్నారు.
శివసేన బాల్ ఠాక్రే కాలంలో ఉన్నట్టు ఇప్పుడు లేదని ఆయన అమాయకంగా ఉండేవాడని ఉద్ధవ్ అన్నారు.“బాలాసాహెబ్ని ఎలా మోసం చేశారో స్వయంగా చూశాను. అందుకే కాస్త చాకచక్యంగా ప్రవర్తిస్తున్నా. నేను మోసపోను. హిందుత్వ ముసుగులో మీరు ఆడిన ఆటలను ఆయన పట్టించుకోలేదు. కానీ నేను చూస్తూ ఊర్కోను ” అని చెప్పారు.
హిందుత్వ అంటూ ఆటలాడుతున్న “కొత్త ఆటగాళ్లను” పట్టించుకోనని పేర్కొంటూ, మహారాష్ట్ర నవనిర్మాణ సేనపై, ఆ పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రేపైనా విరుచుకుపడ్డారు ఉద్దవ్. “నేను రాజ్ ఠాక్రే లాంటి ఆటగాళ్లను పట్టించుకోను. ఈ ఆటగాళ్ళ ఆటలను ప్రజలు ఇదివరకే అనుభవించారు. కొన్నిసార్లు మరాఠీ ఆట ఆడతారు, కొన్నిసార్లు హిందుత్వనా? మహారాష్ట్ర ప్రజలు మీ ఆటల్ని గమనించారు”అని అన్నారు.
గత రెండేళ్లుగా మహమ్మారి కారణంగా థియేటర్లు, సినిమా హాళ్లు మూతపడ్డాయి. కాబట్టి ఎవరైనా ఉచితంగా వినోదాన్ని అందిస్తుంటే, ఎందుకు ఆనందించకుండా ఉంటారని ఉద్ధవ్ చురకేశారు.