తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేేసుకొంటున్నాయి. డీఎంకే పార్టీ కి చెక్ పెట్టేందుకు బీజేపీ చొరవ తీసుకొంది. తమిళనాడు రాష్ట్రం వరకు… బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు ఖరారు అయింది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి వ్యవహరించనున్నారు. రెండు పార్టీల పొత్తుపై బీజేపీ అగ్రనేత అమిత్షా ప్రకటన చేశారు. దీంతో అన్నాడీఎంకే అధికారికంగా NDA కూటమిలోకి జాయిన్ అయినట్లయింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను అధికారం నుంచి గద్దె దించేందుకు తమ పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్య ఎన్నికల వ్యూహకర్త అమిత్ షా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 2026 లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. బహిష్కరించబడిన అన్నాడీఎంకే నాయకులు ఓ పన్నీర్సెల్వం, ఏఎంఎంకే నాయకుడు టీటీవీ దినకరన్లను కూటమిలో చేర్చుకుంటారా అనే ప్రశ్నకు అమిత్ షా బదులిస్తూ, అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని చెప్పారు.
మరో వైపు, తమిళనాడు అధ్యక్షునిగా వై నాగేంద్రన్ నియామకం ఖరారు అయింది. బీజేపీ అధ్యక్ష మార్పుపై అమిత్షా ట్వీట్ చేశారు. అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్ దాఖలైనట్లు చెప్పారు. మరోవైపు పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై బీజేపీకి ప్రశంసనీయ సేవలందించారని పేర్కొన్నారు. మోదీ విధానాలు ప్రజలకు చేరవేయడంలో ఆయన సఫలమయినట్లు రాసుకొచ్చారు. జాతీయ స్థాయిలో అన్నామలై నైపుణ్యాలు ఉపయోగించుకుంటామని వెల్లడించారు. అన్నామలై సహకారం మరవలేనిదన్నారు.
మొత్తం మీద తమిళనాడు లో రాజకీయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లు అయింది.