త్రిపురలో విషాదం చోటుచేసుకుంది. గోమతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న ఓ వాహనం బోల్తా పడటంతో.. నలుగురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. చెల్లిగంజ్ సమీపంలో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బొల్తా కొట్టింది. వీరంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓ బహిరంగ సభకు హాజరై.. తిరిగి స్వస్థలాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మానిక్ సాహ తదితరులు సంతాపం ప్రకటించారు.