ఖమ్మం జిల్లాలో పోలీసుల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రంగంలోకి దిగారు. ఇవాళ సాయి గణేష్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి.. సాయి గణేష్ ఇంటికి వెళ్లి, గణేష్ అమ్మమ్మతో ఫోన్లో మాట్లాడించారు. కేసుపై ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. సాయి గణేష్ కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈనెల 14న ఆత్మహత్యాయత్నం చేసిన సాయి గణేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆత్మహత్యాయత్నం తర్వాత మీడియాకు సాయి గణేష్ ఇచ్చిన బైట్ సంచలనంగా మారింది. మంత్రి పువ్వాడ అజయ్ తోపాటు పోలీసులపై ఆరోపణలు చేశాడు సాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.