మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు పార్టీ శాసనసభాపక్షం మరోసారి 61 ఏళ్ల నోంగ్తొంబమ్ బీరెన్ సింగ్ నే తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరికొన్ని గంటల్లో..మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన పదవీప్రమాణం చేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలు బీరేన్ కు అభినందనలు తెలిపారు. ఉదయం కిరణ్ రిజిజు, భూపేంద్ర యాదవ్ సహా ఇతర ముఖ్యనాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
“ఇది అందరూ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ఇది… మణిపూర్లో స్థిరమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడబోతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈశాన్యభారతంపై ముఖ్యంగా మణిపూర్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. కొత్తగా ఏర్పడుతున్న బీరెన్ ప్రభుత్వం…రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుంది.” అని నిర్మలాసీతారామన్ మీడియాతో అన్నారు.
ఫలితాల వచ్చిన వెంటనే బీరేన్ ఢిల్లీ వెళ్లి మోదీ, షా సహా ముఖ్యనేతల ఆశీస్సులు తీసుకున్నారు. హీంగాంగ్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు బీరేన్. అయితే ఈసారి కూడా బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుందనే నమ్మకంతోనే ఉన్నా… బీరెన్ పై పలువురు కేంద్రాన్ని ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. దీంతో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చవచ్చని భావించారు. కానీ అధిష్టానం ఈ సారి కూడా ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకుంది.
మణిపూర్లోని మొత్తం 60 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 32 చోట్ల గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. రెండోసారి అధికారాన్ని నిలుపుకుంది.