రాజస్థాన్లోని బరన్ జిల్లాలో ఆదివారం ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఛాబ్రా పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పదుల సంఖ్యలో వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. దుకాణాలు బంద్ చేయాలంటూ ఓ వర్గానికి చెందిన కొందరు అలీగంజ్, ఎజాజ్ నగర్ ప్రాంతాల్లో ర్యాలీలా చేపట్టారు. ఈ క్రమంలోనే ఘర్షణ నెలకొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అల్లరిమూకలను చెదరగోట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే దాదాపు 12 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాదు.. పలు దుకాణాలు కూడా లూటీ అయ్యాయి. అల్లరిమూకలు చెలరేగిపోతుండటంతో.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. అంతేకాదు బరన్ ప్రాంతంలో ఏప్రిల్ 13వ తేదీ వరకు ఇంటర్నెట్ సర్వీసులను కూడా నిలిపివేశారు. దీనికి సంబంధించి కలెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.