మహారాష్ట్రలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చివరికి శివసేన ఎవరిది అనే స్థితికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమ వర్గానిదేనని ఏక్నాథ్ వర్గం, ఉద్ధవ్ థాక్రే వర్గం వాదిస్తున్నాయి. ఈ క్రమంలో బలాన్ని నిరూపించుకునేందుకు శివసేనలోని ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాలకు ఎన్నికల కమిషన్ వచ్చే నెల 8 వరకు గడువు విధించింది. రెండు వర్గాల నేతలు పార్టీ తమదేనని ఈసీకి లేఖ రాశాయి. జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని షిండే చెప్తున్నారు. 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్సభ ఎంపీల్లో 12 మంది తమకు మద్దతుగా ఉన్నారని.. శివసన పార్టీ గుర్తు తమకే కేటాయించాలని షిండే ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. దీంతో పార్టీలోని శాసన, సంస్థాగత విభాగాల్లో ఎవరికెంత మద్దతు ఉందో తెలుసుకునేందుకు వీలుగా సంతకాలతో కూడిన లేఖలను సమర్పించాలని ఎన్నికల కమిషన్ చెప్పింది.
ఈ నియామకాలు చెల్లవని ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన చెప్తోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి ముందు తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు జారీ చేసిన అనర్హత నోటీసులపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ఈ నియామకాలు చట్టవిరుద్దమని పేర్కొంది.
ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో అసెంబ్లీ స్పీకర్గా నర్వేకర్ ఎన్నికయ్యాక తీసుకున్న నిర్ణయాలపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.