భవానీపూర్…. దీదీ పరార్ !!
ఇది భారతీయ జనతా పార్టీ శకం. ఈ శతాబ్దం నాది అని ప్రకటించకుండానే కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలను గెలవడానికి బిజెపి జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. పశ్చిమ బెంగాల్లో అహంకారానికి నిదర్శనం అని పేరున్న మమతా బెనర్జీకి చుక్కలు చూపిస్తున్నారు కమలనాథులు. ఆమెకు భయం అంటే ఏమిటో తెలిసి చాలా కాలమైంది. అదీ బిజెపి వల్లే. ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో ఓటమి భయం ఆమెను వెంటాడుతున్నది. అందుకే, నందిగ్రాం జిందాబాద్ అని అటువైపు చూపు చూస్తున్నారు. వామపక్షాల జమానాలో నందిగ్రాంలో ప్రయివేటు కంపెనీలకు స్థలాలను కట్టబెట్టడంపై మమత మండిపడ్డారు. ఆందోళన చేపట్టారు. లెఫ్ట్ పాలనకు సమాధి కట్టడానికి అది పునాదిలా ఉపయోగపడింది. ఆ తర్వాతి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు అదే నందిగ్రాంలో పోటీ చేస్తే తన విజయం ఖాయం అనుకుంటున్నారు దీదీ. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా అమేథీలో ఓటమి భయంతో కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అనుకున్నట్టే అమేథీలో ఓడారు. వనయాడులో గెలిచారు. ఇప్పుడు దీదీ నిర్ణయం ఆ నాటి పరిణామాలను గుర్తు చేస్తున్నది.
రాజధాని కోల్ కతా జిల్లాలో భవానీపూర్ నియోజకవర్గం ఒక భాగం. దాన్ని బెంగాలీలు భబానీపూర్ అంటారు. సీఎం మమతా బెనర్జీ రెండు సార్లు గెలిచిన సీటు ఇది. కానీ ఈసారి మాత్రం ఇక్కడ గెలవడం అనుమానమే అనే భయం పట్టుకుంది. అందుకే ముందు జాగ్రత్తగా నందిగ్రాం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. భవానీపూర్ లో వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఎక్కువ. వాళ్లలో అత్యధికులు హిందువులే. బయటి వారు అంటూ వాళ్లను ఇంతకాలం మమత సంబోధించే వారు. అలాగే, బిజెపి హిందువుల మద్దతు పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బెంగాలీల ఆరాధ్యదైవం దుర్గా మాత ఉత్సవాలకంటే మొహర్రం వంటి వాటికే మమత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ ఊరేగింపులు జరిగేటప్పుడు దుర్గాపూజ నిమజ్జనానికి కూడా అనుమతి ఇవ్వకుండా హిందువుల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో భవానీపూర్ లోని హిందువులు తనను ఓడిస్తారేమో అని దీదీ భయపడుతున్నారట. కోల్ కతా, హౌరాతో పాటు బెంగాల్లోని పట్టణ, నగర ప్రాంతాల్లో బిజెపి జోరు మీదుంది. హిందువుల్లో అత్యధికుల ఓట్లు తమకే అని భరోసాతో ఉంది. మే 2తో మమతా దీదీ పాలన అంతమవుతుందని కమలనాథులు డంకా బజాయించి చెప్తున్నారు. అమేథీలో ఓడినా, వయనాడులో లో రాహుల్ గెలిచారు . మరి మమతా బెనర్జీ తలరాత ఎలా ఉందో.