భార్య ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆపకపోగా… చచ్చిపో అనడమే కాక… ఆమె ఆత్మహత్య చేసుకున్న దృశ్యాల్ని వీడియో తీశాడో దుర్మార్గుడు.నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ ఘటన జరిగింది. కళ్లముందే ప్రాణాలు పోతుంటే అక్కడే నిలబడి వీడియో తీశాడు. ఆ వీడియోను ఆమె బంధువులకు పంపించాడు .
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండమ్మ, మొద్దు పెంచలయ్య భార్యాభర్తలు. పెంచలయ్య ఓ బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీరి ఇద్దరు కుమారుల్లో రెండోవాడు తరుణ్ గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. కుటుంబానికి ఆసరా అవ్వొచ్చని కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తోంది. ఆమెను ప్రోత్సహించాల్సింది పోయి పెంచలయ్య తరచూ ఆమెను వేధిస్తుండేవాడని…వివాహేతర సంబంధాలు అంటగట్టేవాడని చుట్టుపక్కలవాళ్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ ఇద్దరికీ గొడవైంది. భర్త మాటలు తట్టుకోలేని కొండమ్మా తాను అమాయకురాలినని..వేధింపులు ఆపాలని…లేదంటే చస్తాననీ అంది. మాట్లాడుతూనే ఫ్యాన్ కు ఉరేసుకునేందుకు చీరను వేలాడదీసింది. అయినా పెంచలయ్య చలించలేదు. ఎవరికోసం చస్తున్నావ్ నాకోసం కాదంటూ మరింతగా అవమానించాడు. నాటకాలు ఆడొద్దనీ అనడంతో ఆమె నిజంగానే ఉరేసుకుంది. పెంచలయ్య కనీసం ఆపకపోగా ఫోన్లో వీడియో తీయసాగాడు. మెడకు ఉరి పడి గిలగిలా కొట్టుకుంటున్నా కనీసం కనికరించలేదు ఆ మానవమృగం.
ఆమె కొనఊపిరి పోయేవరకూ అసభ్యంగా మాట్లాడుతూనే ఉన్నాడు. నీకు నువ్వే చస్తున్నావని..నేను కనీసం ముట్టుకోలేదని…పోలీసులు, బంధువులు ఎవరొచ్చినా ఈ వీడియో చూపిస్తాననీ అన్నాడు. ఆమె ప్రాణం పోగానే ఆ వీడియోను బావమరిదికి, ఇతర బంధువులకు పంపి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.
బంధువులిచ్చిన సమాచారంలో పోలీసులు పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు.