హైదరాబాద్ కాషాయమైంది. గల్లీలన్నీ జాతీయ నేతలతో నిండిపోయాయి. బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప సభ కోసం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌడ్, జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ సిద్ధమైంది. అగ్రనేతల రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.
ఇక పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శల కౌంటర్..ఎన్కౌంటర్లతో రాజకీయ వేడి రగులుకుంది. భారీ సంఖ్యలో జనం సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనే అంచనాతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలలో రానున్న ఎన్నికలకు రాష్ట్ర శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదివారం నాటి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా భాగ్యనగరంలో జరుగుతున్న బీజేపీ సమావేశాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.
బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా వివిధ శాఖల మంత్రులు, పార్టీ ప్రతినిధులు నిన్ననే నగరానికి చేరుకున్నారు. కాగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా మరికొందరు నేతలు భాగ్య నగరానికి వస్తున్నారు. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈ మైదానంలో 19లక్షల చదరపు అడుగుల మేర సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 4లక్షల చదరపు అడుగుల స్థలంలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూర్చునేందుకు షెడ్లు/టెంట్లు ఏర్పాట్లుచేశారు. ఇందులో వీఐపీల కోసం 7 షెడ్లు సిద్ధమయ్యాయి. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో వేర్వేరుగా మూడు వేదికలను నిర్మిస్తున్నారు. ప్రధాని మోదీ ఆసీనులయ్యే వేదిక మధ్యలో ఉంటుంది.
షెడ్యూల్ ప్రకారం యూపీ సీఎం యోగి ఇవ్వాళ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల యోగి రేపు అంటే ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోకున్నారు. అయినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా చార్మినార్ వద్ద పోలీసులను మోహరించారు. మరోవైపు చార్మినార్ వద్ద టీఆర్ఎస్ నేతల బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్ సిటీ ఆర్మ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ డీసీపీ చైతన్య ఆధ్వర్యంలో పోలీస్ భద్రత పర్యవేక్షణ జరుగుతోంది.
నగరంలో సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్న నేపథ్యంలో… టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్ నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీ కంటే ఎక్కువగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెట్టారు. ఇదిలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ కూడా వారికేమీ తీసిపోమన్నట్టుగా టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేఖంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరు వద్దు – మీ పాలన వద్దు – భవిష్యత్తుకు కాంగ్రెస్ ముద్దు అంటూ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కటౌట్లు, బ్యానర్లు దర్శనమిచ్చాయి.