భగ్గుమన్న భైంసా.. అల్లర్లకు కారణం ఇదేనా..?
నిర్మల్ జిల్లా భైంసాలో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. గతేడాది సంక్రాంతి సమయంలో చోటుచేసుకున్న విషాద సంఘటన మరువకముందే.. ఆదివారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈ సారి ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కత్తులతో స్వైర విహారం చేశారు. అడ్డొచ్చిన వారిపై కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడ్డారు. ఇందులో పలువురు మీడియా జర్నలిస్టులు కూడా ఉన్నారు. అంతేకాదు పలువురు పోలీసులు కూడా తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని జుల్ఫేకార్ గల్లీలో చోటుచేసుకున్న చిన్న వివాదం కాస్తా.. చినికిచినికి గాలివానగా మారి.. పట్టణంలోని ఇతర బస్తీలకు వ్యాపించింది. కుభీరు రహదారి, గణేశ్నగర్, మేదరిగల్లీతోపాటు బస్టాండు సమీప ప్రాంతాల్లో కూడా అల్లర్లు చెలరేగాయి.
రాత్రి 7.30 గంటల సమయంలో.. ఓ వర్గానికి చెందిన యువకులు బైక్స్ సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద శబ్ధం చేస్తూ జుల్సికర్ కాలనీలో తిరగసాగారు. అయితే అక్కడ ఉన్న స్థానికులు వారిని అడ్డుకుని నిలదీశారు. పొద్దంతా రైతులు పొలం పనులు చేసి.. ఇప్పుడు వచ్చిన విశ్రాంతి తీసుకుంటారని.. ఈ సమయంలో ఇబ్బందులకు గురిచేస్తారేంటని ప్రశ్నించిన సమయంలో.. ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఆటో రిక్షాలు, ఓ కారు, బైక్స్ను దుండగులు తగలబెట్టారు. ఇళ్లపై రాళ్లురువ్వుతూ.. కత్తులతో స్వైర విహారం చేశారు. కవరేజ్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్లపై కూడా దుండగులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరిని నిజామాబాద్, హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం.
కాగా, ఈ ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో భారీగా పోలీసుల బందోబస్తు పెంచారు. అదనపు బలగాలను కూడా రప్పించి 144 సెక్షన్ కూడా విధించారు. అల్లరిమూకలను చెదరగొట్టి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
అండగా ఉంటాం..
కాగా, భైంసాలో చెలరేగిన అల్లర్ల విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అల్లర్లలో ఇద్దరు రిపోటర్లు, పోలీసులు, బీజేపీ కార్యకర్తలు గాయపడటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. రిపోర్టర్లు, పోలీసులపై దాడి చేస్తారా ? మనం భారత్ లో ఉన్నామా ? పాకిస్థాన్ లో ఉన్నామా ?పోలీసులు వెంటనే అల్లర్లను ఆపాలి. ప్రభుత్వ పెద్దలకు భయపడి పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాయొద్దు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడం వల్లనే భైంసాలో తరుచు అల్లర్లు జరుగుతున్నాయి.ఈ అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అటు ఫ్లోర్ లీడర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.