భారత దేశం అంతట క్రీడాకారిణి మనుభాకర్ పేరు మార్మోగిపోతోంది భారత తరఫున ఆమె పారిస్ ఒలింపిక్స్ లో బోణీ కొట్టారు. షూటింగ్ క్రీడల్లో ప్రతిభను ప్రదర్శించి మొదటి పతకాన్ని తెచ్చిపెట్టారు.
ఇక్కడే మను భాకర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పారు ప్రతి సందర్భంలోనూ భగవద్గీత శ్రీ రామ రక్ష లా నిలిచిందని ఆమె వివరించారు.
ఈ సందర్భంగా గతంలో ఆమె ఎదుర్కొన్న ఒత్తిడుల గురించి వెల్లడించారు . 2019 మ్యూనిచ్ వరల్డ్ కప్లో నాలుగో స్థానంలో నిలిచి, టోక్యోలో అడుగుపెట్టింది. కానీ… ఇక్కడి మూడు ఈవెంట్లలోనూ కనీసం ఫైనల్ కూడా చేరుకోలేకపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్ మధ్యలో పిస్టల్ మొరాయించింది. దీంతో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్ బెర్తు కోల్పోయింది. దాంతో అరంగేట్ర ఒలంపిక్స్ ఆమెకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ బాధ నుంచి తేరుకునేందుకు తనకు ఏడాది సమయం పట్టిందన్నారు. ఓ దశలో భాకర్ ఈ ఆటలనే వదిలేద్దామని అనుకున్నారు. షూటింగ్ అన్న దానిని పక్కన పెట్టేసి, సివిల్స్ కోసం ప్రిపేర్ అవ్వాలని అనుకున్నారు.
కానీ… మానసిక ప్రశాంతత కోసం భగవద్గీత చదవడం ప్రారంభించింది. గీత బోధించిన పద్ధతులు, కర్మ సిద్ధాంతంపై అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా మనస్సు మార్చుకొని, పారిస్ ఒలంపిక్స్పై ఫోకస్ పెట్టింది. తన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటూ ముందుకు సాగింది. ముందుకు సాగుతున్న ప్రతిసారీ భగవద్గీత శ్లోకాలను గుర్తుచేసుకుంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి ఫలితంపై కాకుండా కర్మపై దృష్టిపెట్టమని చెప్పాడని… తానూ అక్షరాలా అదే చేశానని, దీంతో తన ఒత్తిడి పూర్తిగా దూరమైందన్నారు. తన సక్సెస్లో భగద్గీతే ప్రధాన పాత్ర పోషించిందని మనూ భాకర్ ప్రకటించింది.
కాంస్యంతో బోణీ చేసినందుకు మను భాకర్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ ఫీట్ సాధించిన తొలి మహిళా షూటర్గా నిలవడం ఎందరికో ప్రేరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫోన్ చేసి మరీ మను భాకర్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. శుభాకాంక్షలు మను… మీ గెలుపు వార్తతో దేశం మొత్తం మీ విజయ వైభవంలో మునిగిపోయింది. దేశం గర్వపడేలా చేశారు. షూటింగ్లో మెడల్ సాధించిన భారత తొలి మహిళగా రికార్డు నెలకొల్పినందుకు అభినందనలు’’ అంటూ మోదీ మాట్లాడారు..
మొత్తం మీద ఒలింపిక్స్ లో భారత్ కీర్తి పతాకాన్ని మను భాకర్ రెపరెపలాడించారు.