భద్రాద్రి రామయ్య కల్యాణవేడుక వైభవంగా జరిగింది. అయితే వేలాది, లక్షలాది మంది ప్రాంగణంలో ఆసీనులై ప్రత్యక్షంగా చూస్తుండగా జరిగే వేడుక ఈ సారి కొద్దిమంది భక్తుల మధ్య జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిజిత్ లగ్న సుముహూర్తాన దశరథరాముడు కల్యాణ రాముడయ్యాడు. జానకిని పరిణయమాడాడు.సంప్రదాయం ప్రకారం అర్చకస్వాములు కల్యాణ క్రతువు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, మరో మంత్రి పువ్వాడ అజయ్ స్వామి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. రాములోడి కల్యాణ వేడుకకోసం ఆలయ ప్రాంగణాలను సర్వాంగసుందరంగా అలంకరించారు. కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు.