తమను మోసం చేసి…కుటుంబాలను రోడ్డున పడేలా చేసిన ఆదర్శ్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ నిర్వాహకులకు చర్యతీసుకోవడంతో పాటు తమను ఆదుకోవాలంటూ సంస్థ ఖాతాదారులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. సొసైటీ అడ్వైజర్, బీజేపీ రాష్ట్ర నాయకుడు బేతి మహేందర్ రెడ్డి నాయకత్వంలో వారంతా హైదరాబాద్ లో కేంద్రమంత్రిని కలిశారు.
ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆమోదంతో 18 జనవరి 1999 రోజున గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఫౌండర్ చైర్మన్ గా ముఖేష్ మోడీ, మేనేజింగ్ డైరెక్టర్ గా రాహుల్ మోడీ లు స్థాపించినారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. తర్వాత 28 ఫిబ్రవరి 2008 లో సెక్షన్ 22 కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 ప్రకారం అన్ని రాష్ట్రాలకు విస్తరింప చేసీ దేశ వ్యాప్తంగా 32 రాష్ట్రాల్లో 809 శాఖల్లో అడ్వైజర్లను నియమించి, వారి ద్వారా దేశ వ్యాప్తంగా సుమారు 21 లక్షలకు పైగా ఖాతాదారులను ఇందులో చేర్పించి ఒక్కోక్కరి వద్ద నుండి లక్షల్లో ఈ సొసైటీ లో డబ్బులు పొదుపు చేసినారని బేతి మహేందర్ రెడ్డి వివరించారు. ఈ సొసైటీ 2018 వరకు సక్రమంగా పని చేసిందని, ఇందులో పెట్టిన ఖాతాదారుల నిధులను ముఖేష్ మోడీ, రాహుల్ మోడీ లు ప్రక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) మరియు సెంట్రల్ రిజిస్ట్రార్ తదితర రాజ్యాంగ సంస్థలు తనిఖీలు చేసి ముఖేష్ మోడీ, రాహుల్ మోడీ లను జూన్ 2018 లో అరెస్ట్ చేసి వారి పై కేసులు నమోదు చేసి జైలుకు తరలించారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. అయితే ఆంద్రప్రదేశ్, తెలంగాణలో 2 లక్షల 50 వేల మంది ఖాతాదారుల డబ్బులు 900 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని, 2018 నుండి నేటివరకు ఆ డబ్బులు రాకపోయేసరికి మోసపోయామని భావించి కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డారని, ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని, నేటికి డబ్బులు వస్తాయో, రావో అని మానసిక వేదనకు గురవుతూ ఆనారోగ్యం పాలవుతున్నారని బేతి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ మూతపడడం వలన డిసెంబర్ 2018 లో అహ్మదాబాద్ కు చెందిన విశ్రాంత ఐ.ఏ.ఎస్ అధికారి హెచ్.ఎస్. పాటిల్ ను లిక్విడేటర్ ను నియమించి డిసెంబర్ 2019 వరకు కొనసాగించాలని ఉత్తర్వు ఇచ్చినారు. లిక్విడేటర్ కు ఇచ్చిన గడువు ముగిసినందున, అలాగే సమస్య పరిష్కారం కానందున నవంబర్ 2021 న మళ్ళీ పాటిల్ ను 28 నవంబర్ 2022 వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినారని మహేందర్ రెడ్డి తెలిపారు. ఖాతాదారులందరు కూడా కేంద్రాన్ని కోరేదేమనగా దేశ వ్యాప్తంగా ఉన్న సొసైటీ ఆస్తులను అమ్మి అయిన ఇవ్వాలని, లేక సొసైటీకి కొత్త బాడీని ఏర్పాటు చేసి తమ డబ్బులు తమకు వచ్చేలా చూడాలని, ప్రస్తుతం ఈ శాఖ కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర ఉండడం వలన వారితో మాట్లాడి సమస్య పరిష్కారం చూపాలని బేతి మహేందర్ రెడ్డి ఖాతాదారుల పక్షాన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ని హైదరాబాద్ లో కలసి పై విషయాలను వివరించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి కేంద్ర మంత్రి అమిత్ షా గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించి, ఖాతాదారులందరికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినారని సొసైటీ న్యాయసలహాదారు, బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో మల్లా రెడ్డి, నంబయ్య, రాంచందర్ రావు, రాజేందర్, రాజీ రెడ్డి, దాస్, శ్రీనివాస్ మూర్తి, సదానందం, రామలింగేశ్వర్ రావు, మనోహర్, రవి కుమార్, అశోక్, భాస్కర్ రెడ్డి, రాజమణి, నారాయణ, రఘుపతి రావు తదితరులు 50 మంది ఉన్నారు.