బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు టీఎంసీ నేతలు బీజేపీ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. టీఎంసీలోకి బీజేపీ పార్టీని వీడిన నేతలు చేరుతున్నారు. తాజాగా.. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా టీఎంసీ గూటికి చేరారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 83 ఏళ్లు. 2018లో ఆయన బీజేపీకి గుడ్బైచెప్పారు. కాగా, ఆయన టీఎంసీలో చేరిన తర్వాత.. మీడియతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రజాస్వామ్య వ్యవస్థల దృఢత్వంలోనే ప్రజాస్వామ్యం బలం ఉంటుందన్నారు.
మాజీ ప్రధాని అటల్జీ ఉన్న సమయంలో ఉన్న బీజేపీకి.. ఇప్పుడు మోదీ చేతిలో ఉన్న బీజేపీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. అటల్ జీ సమయంలో బీజేపీ ఏకాభిప్రాయంపై నడిచేదని.. కానీ నేడు అణిచివేయడం, స్వాధీనం పరుచుకోవడంపైనే మోదీ సర్కార్ దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్యాలైన అకాలీదళ్, బీజేడీ పార్టీలు.. బీజేపీని వీడాయని,ఆ పార్టీతో ఇప్పుడు ఎవరున్నారంటూ యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు.