ఇక ముందు ఐఐటీ సంస్థల నుంచి బీఈడీ కోర్సులు అందించాలనుకుంటున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఒడిశా భువనేశ్వర్లోని ఐఐటీ ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయ సంస్థకు చెందిన తాత్కాలిక భవనం ప్రారంభ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రస్తుతం ఉన్న బీఈడీ కాలేజీలు ఆశించిన స్థాయిలో శిక్షణ ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఇక నుంచి మరింత నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారన్నారు. అందుకే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ITEP ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఏడాదే ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవాలనుకునే ఔత్సాహికులకు ఐఐటీలు శిక్షణ ఇస్తే విద్యార్థులకు ఉత్తమ విద్య అందుతుందని తాము ఆశిస్తున్నామని మంత్రి ప్రధాన్ అన్నారు.