బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) దేశంలోని ప్రాంతీయ భాషలలో న్యాయ విద్యను అందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి పౌరుడికి తమ చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతీయ భాషల్లో న్యాయ విద్యను బోధించడం తప్పనిసరి అని బీసీఐ ప్రెస్ నోట్లో పేర్కొంది.
ఎక్కువ మందికి ప్రాంతీయ భాషల్లో న్యాయ విద్యను బోధిస్తే, అది కొందరి అజ్ఞానాన్ని భూస్థాపితం చేసి.. వారిని దోపిడీకి గురవకుండా నిరోధించగలదని.. పాఠశాలలు, యూజీసీ, విశ్వవిద్యాలయాలు సహా విద్యావేత్తలతో కలిసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశంలోని ప్రతి పౌరుడి ఇంటి వద్దకు న్యాయ విద్యను తీసుకువెళుతుందని కూడా పేర్కొంది.
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ(NEP) ప్రకారం, BCI కూడా రెండు భాషల్లో న్యాయ విద్యను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఒకటి ఆంగ్లంలో, మరొకటి రాష్ట్ర భాషలో. దేశంలోని ప్రాంతీయ భాషల్లో న్యాయ విద్యను అందించడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కమిటీకి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి S. A. బోబ్డే నేతృత్వం వహిస్తారు.
న్యాయశాస్త్ర పుస్తకాలు ప్రాంతీయ భాషల్లో ప్రచురించబడుతున్నాయని.. ప్రాంతీయ భాషల్లో న్యాయ విద్యను అందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని కమిటీ నిర్ధారిస్తుంది. సాంకేతిక పదాల తోపాటు న్యాయ పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే పనిలో కూడా కమిటీ పనిచేస్తుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడ్యుకేషన్ రూల్స్ ఇప్పటికే స్థానిక భాషల్లో న్యాయ విద్యను అభ్యసించడానికి అనుమతించింది.