కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు ఆగడం లేదు. మరో వ్యక్తిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. కుల్గామ్ జిల్లాలో విజయ్ కుమార్ అనే బ్యాంక్ ఉద్యోగిని కాల్చి చంపారు ఇస్లామిక్ టెర్రరిస్టులు. విజయ్ కుమార్ స్వస్థలం రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్. స్థానిక ఎలాఖాహి దేహతి బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆఫీసుకు వెళ్తుండగా చుట్టుముట్టిన ఉగ్రవాదులు తుపాకులతో ఆయనపైకి కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. రజనీ బాలా అనే స్కూల్ టీచర్ నూ రెండు రోజుల క్రితమే ఉగ్రమూక కాల్చిచంపిన సంగతి తెలిసిందే.
విజయ్ కుమార్ హత్యను పోలీసులు నిర్థారించారు. ఆప్రాంతాన్ని చుట్టుముట్టామని… ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని పోలీసులు ట్వీట్ చేశారు.
గత రెండు నెలలుగా ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. ముఖ్యంగా లోయలో వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులనే. అక్కడ విధులకోసం, ఇతరత్రా వ్యాపారాల కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని హత్యాకాండ కొనసాగిస్తే వెనక్కి వెళ్తారని వాళ్ల వ్యూహం. అలాగే అనేకమంది కశ్మీరీ హిందువులు పీఎం ప్యాకేజీ కింద అక్కడ ఉద్యోగాల్లో ఉన్నారు. లోయలో ఉగ్రవాదులు వాళ్లనూ లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సహా వలసదారులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచి భద్రత కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరక్ బుధవారం జరిగిన కీలక సమావేశానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షత వహించారు.
అటు ఉగ్రవాదుల వరుస దాడులతో కశ్మీర్లోని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చి పలుచోట్ల నిరసనలకు దిగారు.