బంగ్లాదేశ్ లోని హిందువులు ఐక్యత దిశగా ప్రయాణం చేస్తున్నారు. కొద్దిరోజులుగా హిందువుల మీద టార్గెట్ చేసి దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐకమత్యంగా ఉంటే తప్ప ఈ దాడులను ఎదుర్కోలేము అని అక్కడి హిందువులకు అర్థమయింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఏకతాటి మీదకు వస్తున్నారు.
మరోవైపు బంగ్లాదేశ్ లోని ఇతర మైనార్టీ వర్గాలు అయిన బౌద్ధులు జైనులు క్రైస్తవులను కలుపుకొని హిందువులు ఐక్య సంఘటనగా ఏర్పడుతున్నారు. వివిధ ప్రాంతాలలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మైనారిటీలంతా ఒక్కచోట చేరి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ దేశాన్ని విడిచిపెట్టేది లేదంటూ మైనార్టీ వర్గాలు నినదిస్తున్నాయి. హిందూ జాగరణ్ మంచ్ నాయకత్వంలో హిందువులు మరియు ఇతర మైనారిటీ వర్గాలపై దాడులు, దహనం, దోపిడీలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని షాబాగ్లో ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో వేలాది మంది హిందువులు పాల్గొన్నారు. దినాజ్పూర్లో 4 హిందూ గ్రామాలను తగలబెట్టడం పై తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా మైనారిటీ మంత్రిత్వ శాఖ, మైనారిటీ రక్షణ కమిషన్, మైనారిటీలపై దాడులను నిరోధించేందుకు కఠిన చట్టాలతో పాటు 10 శాతం పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
మైనారిటీల కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉండాలని ఈ సంఘాలు పట్టు పడుతున్నాయి. హిందువులపై దురాగాతాలకు వ్యతిరేకంగా ఠాకూర్గావ్లో సైతం ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో 4 వేల మందికి పైగా పాల్గొన్నారు. హిందువులకు రక్షణ కల్పిస్తామని ఠాకూర్గావ్ సదర్ ఉపజిల్లాకు చెందిన అధికారి హామీ ఇవ్వడం వారు కాస్త శాంతించారు.
మైనారిటీల మీద దాడులకు సంబంధించిన రెక్కలను కూడా బయట పెడుతున్నారు. బంగ్లాదేశ్లోని 64 జిల్లాల్లో 52 జిల్లాల్లో మైనారిటీలపై అఘాయిత్యాలు జరిగాయని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవం ఐక్యత మండలి వ్యాఖ్యానించింది. మైనారిటీలపై 205 అఘాయిత్యాలు జరిగాయని తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు మహ్మద్ యూనస్కు ఈ సందర్భంగా ఐక్యత మండలి బహిరంగ లేఖలో ఫిర్యాదు చేసింది. మైనారిటీల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితి నెలకొందని, ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేసింది.
మొత్తం మీద ఆత్మ రక్షణ దిశగా బంగ్లాదేశ్ లోని మైనార్టీలు కార్యాచరణకు దిగారు. ఎక్కడికక్కడ సమూహాలుగా ఏర్పడి దాడులను ప్రతిఘటించాలి అని నిర్ణయించుకున్నారు. తమకు తామే రక్షణ కల్పించుకోవాలి అని బంగ్లాదేశ్ లోని హిందువులు సహా అన్ని మైనారిటీలు తీర్మానించుకున్నారు.