బంగ్లాదేశ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి [IMF] నుంచి 4.5 బిల్లియన్ డాలర్ల అప్పు కోసం అభ్యర్ధన పంపింది. బంగ్లాదేశ్ కి చెందిన డెయిలీ స్టార్ న్యూస్ కధనం ప్రకారం శ్రీలంక, పాకిస్థాన్ ల సరసన బంగ్లాదేశ్ కూడా చేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించింది. రోజు రోజుకి తగ్గిపోతున్న బంగ్లాదేశ్ విదేశీ మారక ద్రవ్య నిధుల వల్ల బంగ్లాదేశ్ ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్ర ఒత్తిడి ఉందని అందుకే ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా IMF తలుపు తట్టిందని డైలీ స్టార్ న్యూస్ వ్యాఖ్యానించింది.
బంగ్లాదేశ్ రెడీమేడ్ దుస్తుల ఎగుమతి విషయంలో మిగతా ఆసియా దేశాల కంటే ముందు ఉన్నదన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం టెక్స్ టైల్స్ ఎగుమతి మీదనే పూర్తిగా ఆధారపడి బండి లాగించడం బంగ్లాదేశ్ కు కష్టంగా మారింది. ఈ విషయంలో పలువురు ఆర్ధిక నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు కేవలం ఒకే రంగం నుంచి ఎగుమతులు చేస్తూ మిగతా విషయాల మీద దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ముప్పు తప్పదని.. కానీ టెక్స్ టైల్స్ రంగం వృద్ధి రేటు బాగా ఉండడంతో ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తూ వచ్చింది ఇన్నాళ్ళు.
కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కూడా బంగ్లాదేశ్ తన రెడీమేడ్ దుస్తుల తయారీ పనిని ఆపలేదు. కానీ ఆ ఆర్డర్లు అన్నీ కోవిడ్ లాక్ డౌన్ కంటే ముందు ఇచ్చిన ఆర్డర్లు అవడంతో కోవిడ్ లాక్ డౌన్ సమయంలో బంగ్లాదేశ్ టెక్స్ టైల్స్ పరిశ్రమ నిలకడగా ఉంది. కానీ గత నాలుగు నెలలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధo వలన ముడి చమురు ధర బాగా పెరిగిపోవడం ఒక ఎత్తయితే.. వంట నూనె, గోధుమల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వలన అన్ని దేశాల తోపాటు బంగ్లాదేశ్ డాలర్ రిజర్వ్ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చింది. యూరోప్, అమెరికాలలో తీవ్ర రూపం దాల్చిన ద్రవ్యోల్బణం వలన బంగ్లాదేశ్ కి ప్రస్తుతం ఆర్డర్లు తగ్గుముఖం పట్టాయి. నిజానికి యూరోపు నుంచి తక్కువ ధరకి కోట్ చేసి సింహభాగం చైనా ఆర్డర్లు తీసుకుంటూ వచ్చింది వాటిని బంగ్లాదేశ్ లో పనిచేయించుకొని తిరిగి చైనా వాటిని యూరోపుకి సప్లై చేస్తూ వచ్చింది కానీ మారిన పరిస్థితులలో చైనా ఇదివరకటి లాగా బంగ్లాదేశ్ కి ఆర్డర్లు ఇవ్వకుండా చైనాలోనే దుస్తులు కుట్టించి ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కి చైనా నుంచి ఆర్డర్లు తగ్గడం కూడా డాలర్ రిజర్వ్ మీద ప్రభావం చూపించింది.
బంగ్లాదేశ్ ఆర్ధిక వ్యవస్థ విలువ 416 బిలియన్ డాలర్లు కాగా పెరిగిన ముడి చమురు, వంట నూనె, గోధుమల ధరలు బంగ్లాదేశ్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. దిగుమతుల బిల్లు విలువ పెరిగిపోవడం ఒక కారణం అయితే ఎగుమతుల బిల్లులో కోత పడడం మరో కారణం. దీని వల్ల కరెంట్ అకౌంటులో లోటు ఏర్పడ్డది.
బంగ్లాదేశ్ ఆర్ధిక మంత్రి AHM ముస్తఫా కమల్.. వారం క్రితం IMF మానేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలీన జార్జియోవాకి బంగ్లాదేశ్ రుణం కోసం మెయిల్ చేసినట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారు ఒకరు తెలిపారు. అయితే బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు మాజీ గవర్నర్ అతుర్ రెహమాన్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐఎంఎఫ్ నుంచి అప్పు తీసుకోవడం ముందస్తు జాగ్రత్త చర్యగా చెప్పారు. శ్రీలంక లాగా చివరి నిముషం వరకు ఆగి అప్పుడు అప్పుకోసం ప్రయత్నించే కంటే మూడు నెలలు ముందుగానే మన సెంట్రల్ బ్యాంకులో డాలర్ రిజర్వ్ ని ఉంచుకోవడం మంచి పరిణామం అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు దగ్గర రెండు నెలలకి సరిపడా దిగుమతులు చేసుకోవడానికి తగిన డాలర్ రిజర్వ్ ఉందని కానీ ముందుముందు ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగే అవకాశాలని కొట్టిపారవేయలేం కాబట్టి బంగ్లా ప్రభుత్వ చర్యని నేను సమర్ధిస్తున్నా అన్నారు.
కానీ ఐఎంఎఫ్ కంటే వేరే ప్రైవేట్ సంస్థల నుంచి దీర్ఘకాలిక తక్కువ వడ్డీతో దొరికే రుణాలు తీసుకుంటే మేలు అని సలహా ఇచ్చారు.
కానీ ఇప్పడు మొదలు పెడితే కనీసం మూడు నెలలకు పైగా డాక్యుమెంటేషన్ కోసం పడుతుంది అని కాబట్టి ఐఎంఎఫ్ నుంచి వేగంగా రుణ మంజూరు అవుతుంది కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ఐఎంఎఫ్ నుంచి రుణం కోరడం అనేది తప్పని సరి అయింది అని వ్యాఖ్యానించారు మాజీ సెంట్రల్ బ్యాంకు గవర్నర్.
బంగ్లాదేశ్ కరెంట్ అకౌంట్ లోటు గత సంవత్సరం మే నెల నుంచు ఈ సంవత్సరం జూన్ నెల వరకు కరెంట్ అకౌంటు లోటు $17. 2 బిలియన్ డాలర్లు గా ఉంది. అదే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో $2.7 బిలియన్ డాలర్ల లోటు ఉంది. అంటే దాదాపుగా 15 బిలియన్ డాలర్ల లోటు ఉంది. గత జూన్ నెల వరకు బంగ్లాదేశ్ దిగుమతుల శాతం 39% గా ఉండగా ఎగుమతుల శాతం 34% గా ఉంది. ఉన్నది 5% తేడానే అయినా ధరలు పెరగడం, బంగ్లా టాక డాలర్ తో పోలిస్తే పడిపోవడం వలన తీవ్ర కరెంట్ అకౌంటు లోటు ఏర్పడ్డది. అదే సమయంలో విదేశాలలో ఉన్న బంగ్లా జాతీయులు తమ దేశానికి పంపిన డాలర్లు 1.84 బిలియన్ డాలర్లుగా ఉండి గత సంవత్సరం కంటే 5% తగ్గింది.
ఇక అత్యవసర వస్తువులు తప్పితే మిగతావి ఏవీ కూడా దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు విధించింది బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు. అంటే లగ్జరీ వస్తువులు ఏవీ కూడా దిగుమతి చేసుకోవడానికి సెంట్రల్ బ్యాంకు అనుమతి ఇవ్వదు. ఇక విదేశీ ప్రయాణాల మీద కూడా ఆంక్షలు విధించింది సెంట్రల్ బ్యాంక్. ముందుగా సెంట్రల్ బ్యాంకుకి దరఖాస్తు పెట్టుకొని ఎందుకోసం విదేశీ ప్రయాణం చేయదలుచుకున్నారో వివరణ ఇస్తేనే కానీ సెంట్రల్ బ్యాంకు ప్రయాణానికి అవసరమైన డాలర్లు ఇస్తుంది. ఇక పెట్రోల్, డీజిల్ ల మీద వారానికి ఒక రోజు కోత పెట్టాలని నిర్ణయం తీసుకుంది బంగ్లా ప్రభుత్వం. ఆదివారం రోజున పెట్రోల్ బంక్ లు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది. వారానికి ఒక రోజు మంచి ఫలితాలని ఇవ్వకపోతే పెట్రోల్, డీజిల్ మీద రేషన్ విధిస్తారు అంటే రోజుకి ఇన్ని లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ అని అమ్ముతారు.
బంగ్లాదేశ్ లో ఇప్పటికే రోజుకి 8 గంటల విద్యుత్ కోతని విధిస్తున్నారు కానీ తాజాగా కొన్ని ప్రాంతాలలో దీనిని రోజుకి 13 గంటల పాటు కోత విధించింది బంగ్లా ప్రభుత్వం. ముఖ్యంగా సిల్హేట్ [Sylhet] అనే ప్రాంతంలో రోజుకి 13 గంటల విద్యుత్ కోతని విధిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ లో చాలా వరకు విద్యుత్ ఉత్పత్తి డీజిల్ ఆధార జెనెరేటర్స్ ద్వారా జరుగున్నది కాబట్టి డీజిల్ ధరలు పెరగడంతో దిగుమతుల మీద కోత పెట్టింది బంగ్లా ప్రభుత్వం.. దాంతో లోడ్ షెడ్డింగ్ వలన 13 గంటల విద్యుత్ కోత తప్పనిసరి అయిపోయింది.
బంగ్లాదేశ్ లో ఏం జరిగితే మనకెందుకు ? అనే వాళ్ళకి సమాధానం :
అంతా బాగున్నప్పుడే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు యధేచ్చగా జరుగుతూ వచ్చాయి. మరి ఇప్పుడు ? మునపటి కంటే ఎక్కువ మొత్తంలో అక్రమ చొరబాట్లు పెరుగుతాయి. విద్యుత్ కోత వలన పని దొరకడం కష్టం అవుతుంది.. అలాగే దాని ప్రభావం అక్కడి ఆర్ధిక వ్యవస్థ మీద కూడా ఉంటుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ల మీద కోత అమలవడం మరో వైపు పరిశ్రమలు పూర్తి సామర్ధ్యంతో పనిచేయలేకపోవడం సహజంగానే అక్కడి ప్రజలకి భారత్ ఒక అవకాశంగా కనపడుతుంది.
ఇక మనిషికి 3,000 రూపాయలు ఇస్తే బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి చెరవేస్తారు స్మగ్లర్లు. ఇక బిఎస్ఎఫ్ జవాన్ల కి దొరికితే మరో వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది భారత్ లోకి వెళ్ళడానికి. ఇక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ రెవెన్యూ అధికారులకి అయితే మరో 3000 చెల్లించాలి. ఒక వేళ డబ్బులు లేకపోతే అక్రమంగా చొరబడిన వాళ్ళకి ఒక రహస్య నెంబర్ తో టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ చూపెట్టి ఎక్కడాయినా తక్కువ జీతానికి పని చూపిస్తారు. వాళ్ళ మూడు వేల రూపాయలు రికవరీ చేసుకొని వదిలేస్తారు. అలా వచ్చిన వాళ్ళకి తృణమూల్ కార్యకర్తలు స్థానిక గుర్తింపు కార్డులిస్తారు. అన్ని వివరాలు తృణమూల్ కార్యకర్తల దగ్గర ఉంటాయి. ఎన్నికలప్పుడు బూత్ వారీగా వీళ్ళ వోట్లు పడ్డాయ లేదా అని చెక్ చేస్తారు. ఇలా అక్రమ చొరబాట్లు ఇప్పుడు మరింత వేగంగా జరిగే అవకాశాలని కొట్టిపారవేయలేము.
ప్రస్తుతం మమత టార్గెట్ అక్రమ చొరబాటు దారుల శాతం ని ఇప్పుడున్న 30% ని మరో 5 శాతం పెంచి మొత్తం 35% గా చేయాలని ప్లాన్!వీళ్ళ ఓట్లు అన్నీ తృణమూల్ కే పడేట్లు కార్యకర్తలు చూసుకుంటారు. విచిత్రం ఏమిటంటే ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి వచ్చి స్థిరపడ్డ వారినే తాజాగా వచ్చే వాళ్ళ వివరాలు సేకరించి దగ్గర పెట్టుకునే బాధ్యత అప్పగించింది మమత.
శ్రీలంక నుంచి భారత్ కి ఒక బోట్ లో చేర్చాలంటే ఒక్కో ప్రయాణీకుడి దగ్గర నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నారు స్మగ్లర్లు.. దాంతో తాజా శ్రీలంక సంక్షోభం వలన 250 మంది కంటే ఎక్కువ శ్రీలంక తమిళులు.. తమిళనాడు తీరానికి రాలేక పోయారు. కానీ బంగ్లాదేశ్ పరిస్థితి అలాలేదు. అదృష్టం బాగుంటే 3 వేలతో చొరబడవచ్చు లేదా 10 వేలు ఖర్చు అవుతుంది. అసలు రూపాయి ఖర్చు లేకుండా మడ అడవుల ద్వారా వెస్ట్ బెంగాల్ లోకి చేరుకునే వారిలో యువకులు ఎక్కువగా ఉంటున్నారు.
~ పార్ధసారధి పోట్లూరి