మునుగోడు పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పులను పార్టీ చీఫ్ సంజయ్ పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. మునుగోడు సభకోసం వచ్చిన షా..ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఇద్దరూ ఆలయం బయటకి వచ్చారు. షాను దాటుకుని ముందుకు వెళ్లిన సంజయ్ కిందకు వంగి ఏదో తీస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. అయితే అవి చెప్పులేనని ప్రచారం చేస్తూ ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు. వీడియోలో చెప్పులు స్పష్టంగా కనిపించకపోయినా సంజయ్ అక్కడున్న చెప్పుల్ని చేత్తో తీసి షాకు అందించారని..ఆసమయంలో అమిత్ షా వద్దని వారించినట్టు అక్కడివారు చెబుతున్నారు.
ఇక అవకాశం దొరికిందే అన్నట్టు అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. గుజరాత్ నాయకులకు ఊడిగం చేయడం..ఉరికిఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా అని నాయకులు సైతం సోషల్మీడియాలో పోస్టులు చేస్తున్నారు. స్వయంగా మంత్రి కేటీఆర్ సైతం ట్వీట్ చేయడంతో దీనిపై చర్చ నడుస్తోంది. అమిత్షా చెప్పులు మోసిన సంజయ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు.
“దిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, దిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుణ్ని తెలంగాణ రాష్ట్రం గమనిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉంది” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పులు మోసి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలకు బానిసత్వాన్ని పరిచయం చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించపరిచారని ఆరోపించారు. మునుగోడు ఆత్మగౌరవంగా చెబుతున్న భాజపా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ, అమిత్ షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందన్నారు.