ప్రసిద్ధ బనారస్ యూనివర్సిటీ “హిందూ స్టడీస్ “ మీద కొత్త కోర్సు ప్రవేశపెడుతోంది. ప్రాచీన గ్రంథాలలోని యుద్ధతంత్రాలు ఈ కోర్సులో ఉంటాయి. మహిళా సైనికుల పాత్ర, సైన్యం వ్యూహాలు, శిబిరాల ఏర్పాటు వంటివి అందులో చేర్చారు. ప్రాచీన వేద సాహిత్యంలోని డిఫెన్స్ స్టడీస్ ను అధ్యయనం చేస్తూ…ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే అంశాలు తెలియచెప్పడమే కోర్సు ముఖ్య ఉద్దేశం.
కోర్సులో ప్రధానంగా “ఇండియన్ మిలిటరీ, సైన్స్ అండ్ స్ట్రాటజీ’ పేరుతో ఒక పేపర్ కింద నాలుగు యూనిట్లు ఉంటాయి.
*మిత్రులు, శత్రువులు -నిర్వచనం
*శత్రువులపై విజయం సాధిస్తూ మిత్రులను ప్రోత్సహించే విధానం
*సైన్యంలో మహిళల పాత్ర
*కోటలు, సైనిక శిబిరాల నిర్మాణం
*యుద్ధానికి అనువైన వేళలు, ప్రదేశం
*యుద్ధవ్యూహాలు-అమలు
*గెలుపు లేదా ఓటమి తరువాత వ్యూహాలు… మొదలైనవి.
ప్రపంచానికంతటికీ తెలుసు …వేద సాహిత్యంలో సైనిక విజ్ఞానం, సైన్యం వ్యూహాల గురించిన ప్రస్తావన ఉంది. అయితే ఆ జ్ఞానం ఇప్పటివరకు అభ్యాసంలోకి రాలేదు. విద్యార్థులకు పాఠ్యాంశాల ద్వారా ప్రాచీన సైనిక శాస్త్రం, వ్యూహాలు తెలియచేయడం, అధ్యయనం చేయించడం ఈ పరిస్థితుల్లో అవశ్యకం అని యూనివర్సిటీ ప్రొఫెసర్లు తెలిపారు.
ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు రెండు ముఖ్యమైన పుస్తకాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సంస్కృతంలోని వశిష్టుడి’ధనుర్వేద సంహిత” తో పాటు వైశంపాయనుడి ‘నీతి ప్రకాశిక”లో సైనిక వ్యూహలుంటాయి. వాటి గురించి చాలామందికి తెలీదు.
దేశ రక్షణలో చైనా వంటి దేశాలు ప్రాచీన సైనిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అయితే భారతదేశానికి చెందిన వేదకాలంనాటి గ్రంథాలు, ప్రాచీన సాహిత్యంలో కూడా రాజ్యరక్షణకోసం ప్రత్యేక వ్యూహాలు..బయటి అంతర్గత శత్రువులతో ఎలా వ్యవహరించాలనేదానిపై కీలక సమాచారం ఉందని అంటున్నారు.
యుద్ధం, రాజకీయాలు, జాతీయ వ్యూహం, పరిపాలనకు సంబంధించిన అంశాలపై భారతీయ శాస్త్రగ్రంథాల్లో ప్రత్యేక ప్రస్తావన ఉంది. అలాంటి ముఖ్యమైన అంశాలపై మరింత అధ్యయనం, పరిశోధన మరింత విస్తృతంగా జరగాలి. ఇంతవరకు మెయిన్ సిలబస్ లో ప్రత్యేక పాఠ్యాంశాలుగా లేవు. హిందూస్టడీస్ లో భాగంగా…బనారస్ హిందూ యూనివర్సిటీలోని ఫిలాసఫీ అండ్ రిలీజియన్, భారత్ అధ్యయన కేంద్రం, సంస్కృత విభాగం, ప్రాచీన చరిత్ర, సంస్కృతి, పురావస్తుశాఖలు ఆ ప్రయత్నమే చేస్తున్నాయి.
ఒకప్పుడు మిలిటరీలో మహిళలు పోషించిన పాత్రకీలకం. “చరిత్రలో సైన్యం, యుద్ధాల్లో మహిళల భాగస్వామ్యం చాలా గొప్పది. రాణి అహల్యాబాయి హోల్కర్, రాణి లక్ష్మీబాయి వంటి వాళ్లు యుద్ధభూమిలో పోరాటం చేశారు. ఇప్పుడూమహిళలు రక్షణసేవల్లో భాగం కావాలి. అది మన మూలాల్లోనే ఉంది అనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాలవాళ్లు హిందువులు వారి నాగరికత గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.ఇక విదేశాల్లో స్థిరపడిన వాళ్లైతే మరింత ఆసక్తిగా ఉన్నారు. తమ మూలాలను వెతుక్కుంటూ వెళ్లి, మరింత కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ప్రాచీన సాహిత్య గ్రంథాల్లోని జ్ఞానసంపదను తెలుసుకోవాలని తిరిగి పొందాలనే సంకల్పం వారిలో కనిపిస్తోంది.
ఇక ఈ తాజాగా ప్రవేశపెట్టిన కోర్సులో మొదటి సంవత్సరం 40మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. 2 ఏళ్ల MA కోర్సులో 9 కచ్చితమైన , 7 ఐచ్ఛికమైన పత్రాలు ఉంటాయి.
ఇలా సైనిక శాస్త్రం, తత్వశాస్త్రం, జ్ఞానశాస్త్రం వంటి హిందూ మత గ్రంథాల్లోని వివిధ అంశాలకు అకడమిక్ ఫార్మాట్ ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారి. సిలబస్లో సంప్రదాయ హిందూజీవన విధానం, ప్రధానసూత్రాలు, వ్యాఖ్యానాలు, చర్చలు, ఆయా గ్రంథాల అర్థాన్ని వివరించే నిర్ణయించే పద్ధతులు, పాశ్చాత్య జ్ఞానం, రామాయణం, మహాభారతం, వాస్తుశిల్పం, జానపద, జానపద-నాటకం, భాషాశాస్త్రం , ప్రాచీన సైనిక శాస్త్రం ఉన్నాయి.
-దేవి