జిత్తుల మారి నక్క కూడా సిగ్గుపడేలా.. గాల్వాన్ వీడియో రిలీజ్ చేసిన డ్రాగన్
https://twitter.com/evazhengll/status/1362738610915717120
చైనా జిత్తుల మారి వేశాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇప్పుడు ఆ జిత్తులు వేసే నక్క కూడా డ్రాగన్ వేశాలు చూసి సిగ్గుపడుతుందేమో. గతేడాది జూన్ 15వ తేదీన భారత సైనికులకు, చైనా సైన్యానికి మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే చైనా సైనికులు కూడా దాదాపు 40 మందికి పైగా మరణించారని భారత సైన్యం తెలిపింది. అయితే భారత సైన్యం కామెంట్స్ను చైనా కొట్టిపారేసింది. తమ సైనికులు ఎవ్వరూ కూడా మరణించలేదని ప్రగల్భాలు పలికింది. అందుకు మన దేశానికి చెందిన కొందరు రాజకీయ నేతలు కూడా చైనాకు వత్తాసు పలికారు. అయితే కొద్ది రోజుల తర్వాత చైనాకు చెందిన కొందరు వ్యక్తులు కొందరి సైనికుల సమాధుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చైనా వైపు కూడా ప్రాణనష్టం వాటిల్లిందని తెలిసింది.
ఇదంతా ఇలావుంటే తాజాగా చైనా తమ దేశానికి చెందిన నలుగురు సైనికులు చనిపోయారంటూ అధికారిక మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ మీడియా తెల్పిన వివరాల ప్రకారం కేవలం నలుగురు మాత్రమే మరణించినట్లు చెప్తున్నప్పటికీ.. 40 మందికి పైగానే మరణించారని పలు అంతర్జాతీయ మీడియా కూడా తెల్పింది. తాజాగా శుక్రవారం నాడు గాల్వాన్ వ్యాలీ ఘర్షణకు సంబంధించి చైనా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రెండు దేశాలకు చెందిన ఆర్మీ దళాలు.. స్టీల్ రాడ్లతో కొట్టుకున్నట్లు తెల్పుతోంది. అంతేకాదు.. ఇది పూర్తిగా ఎడిట్ చేసిన వీడియో అని కూడా తెలుస్తోంది. ఇందులో చైనా కమాండర్ ఒకరు భారత దళానికి వార్నింగ్ ఇస్తున్నట్లు కన్పించారు. ఆ తర్వాత లోయలో ఇరు దేశాలకు చెందిన సైన్యం ముందుకు వచ్చి ఘర్షణకు దిగినట్లు చూపుతోంది. ఈ ఘటనలో చైనా దళాధిపతి తీవ్రంగా గాయపడ్డట్లు చూపెట్టింది. కేవలం భారత్దే తప్పు అన్నట్లు చిత్రీకరించేందుకు చైనా ప్రయత్నించింది. అయితే తొలుత చైనా సైనికులు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి.. ఇప్పుడు నలుగురు మరణించారని.. ఆ తర్వాత వీడియో రిలీజ్ చేయడాన్ని చూస్తే.. చైనా తరఫున పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అంతేకాదు చైనా వేస్తున్న ఈ జిత్తుల మారి వేశాలను నమ్మవద్దన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చైనా మరోసారి తన వంకర బుద్ధి చూపే అవకాశం ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.