1. బల్దియాపై టీఆర్ఎస్ పాగా వేసిందిలా
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గతంలో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీనే పెట్టుకోనుంది.
గ్రేటర్ పాలకవర్గ ఎన్నికలు 2016 ఫిబ్రవరి 2న జరిగాయి. అదే నెల 5న కౌంటింగ్ జరిగింది. దానికిముందు జనవరి 12 నుంచి 15 వరకు నామినేషన్లు స్వీకరించారు.18న నామినేషన్లు పరిశీలించారు. నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ప్రస్తుతం పాలకవర్గ గడువు ముగిసిపోతోంది. ఈలోపులో కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయాలి. అసాధారణ పరిస్థితి ఏర్పడితే ఎన్నికలు నిర్వహించకుండా 6 నెలలపాటు ప్రత్యేక అధికారి పాలనను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక బల్దియాలో ఉన్న 150 డివిజన్లలలో 99 డివిజన్లలో అధికార టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. ఈసారి కూడా కాస్త అటుఇటుగా స్థానాలు సాధిస్తామన్న ధీమాలో ఆ పార్టీ నేతలున్నారు. గతంలో ఎంఐఎం, కాంగ్రెస్ కు సంబంధించిన వారే ఎక్కువగా బల్దియా మేయర్ పీఠంపై కూర్చొగా మొట్టమొదటి సారి 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అప్పట్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి. తమకు బల్దియా పీఠం ఇస్తే 100 రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు మార్చేస్తామని గులాబీ నేతలు చెప్పడంతో నగరవాసులంతా కారు
గుర్తుకే ఓటు వేసి టీఆర్ఎస్ కు మేయర్ పదవి అప్పగించారు. బల్దియాలో టీఆర్ఎస్ ఎదిగిన తీరు ఒకసారి పరిశీలిద్దాం.
2009 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కనీసం పోటీ చేయడానికి కూడా సంసిద్ధం కాలేకపోయింది. అప్పటికే పదేళ్ల క్రితం ప్రారంభమైన టీఆర్ఎస్ ఉనికిని చాటుకోడానికి కూడా ఆ ఎన్నికల్లో సాహసించలేకపోయింది. 2009 జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్-52, తెలుగుదేశం-45, ఏఐఎంఐఎం-43, బీజేపీ-5, పీఆర్పీ-1, ఇతరులు-4 చోట్ల గెలుపొందారు. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలు వేర్వేరుగా పోటీ చేసినా మొత్తం 45+5= 50 సీట్లు కైవసం చేసుకున్నాయి.
2016 వరకూ జంట నగరాల పరిధిలో టీఆర్ఎస్ ఉనికి చాటుకోలేకపోయింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయానికి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 19 నెలలైంది. అప్పటికీ రాష్ట్రంలో, గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలు అంతగా ఏమీ లేవు. కనీసం పాలన మార్కు కూడా చాటుకోలేదు. అలాంటి స్థితిలో వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ బాగా ఫోకస్ పెట్టింది. ఎలా అయినా సరే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాలని నిర్ణయించుకుంది. 2016 బల్దియా ఎన్నికల్లో వంద సీట్లు పక్కా సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఆ విధంగానే ప్రణాళికలు రచించి విజయం దక్కించుకుంది. 150 డివిజన్లలలో 99 డివిజన్లలో అధికార టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది.
అయితే మహానగరాన్ని ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తడంతో వేలాది కాలనీలు ముంపు బారినపడ్డాయి. పరిస్థితి ఎంతదారుణంగా మారిందంటే 26 రోజులైనా ఇంకా అనేక కాలనీలు ముంపులోనే ఉన్నాయి. బాధితులకు తోడ్పాటు అందించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.550 కోట్ల పరిహారాన్ని మంజూరు చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారు. ఈ పంపిణీలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు మహానగరంలో తాము ఈ ఆరేళ్లలో రూ.వేల కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టామని మళ్లీ తమదే విజయమని టీఆర్ఎస్ చెబుతుండగా.. మరోవైపు టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివిరిస్తూ తాము బల్దియా పీఠంపై కాషాయా జెండా ఎగురువేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.