బండి జోరు; సారు- కారు బేజారు!
ఇది మూడు నెలల ముచ్చటా? లేక రెండు ఓటముల ప్రభావమా? మొత్తానికి సారులో, కారు పార్టీలో మేధోమథనం భారీగానే జరిగినట్టుంది. బిజెపి జోరుతో గులాబీ పార్టీలో ప్రకంపనలు మామూలుగా లేవు అనే సంకేతాలు బలంగానే వినవస్తున్నాయి. హటాత్తుగా నిరుద్యోగ భృతి హామీ గుర్తుకు వచ్చింది. అట్లనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమైన మంత్రి, యువరాజు కెటిఆర్ సెలవిచ్చారు. ప్రజలు తమకు శాశ్వతంగా సెలవు ఇవ్వకుండా ఉండటానికి తండ్రి, కొడుకు భారీగానే కసరత్తు చేస్తున్నట్టున్నారు.
దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు హీరోగా జనం ముందుకు వచ్చారు. అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందనే స్థాయిలోటిఆర్ ఎస్ పై విమర్శలు వెల్లువెత్తిన ఎన్నికల అది. పోలీసులు ఎంత అతి చేసినా, ఎవరిదో డబ్బును ఇంకెవరిదో అని చెప్పి బెదిరించబోయినా, కార్యకర్తలపై కేసులు, లాఠీలు, ఇంకా ఎన్నెన్ని అనైతిక చర్యలకు పాల్పడినా దుబ్బాక ప్రజలు బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు జై కొట్టారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను కాస్త ఆలస్యంగా నిర్వహించడం ద్వారా బిజెపి జోరుకు గులాబీ నేతలు కాస్తయినా అడ్డుకట్ట వేస్తారేమో అని కొందరు పరిశీలకులు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా, పట్టుని పది రోజుల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసేలా షెడ్యూలు వచ్చింది. వరద సాయం కొలిక్కి రాకుండానే హడావుడిగా ఎన్నికల కోడ్ తెచ్చుకుని సర్కారీ పెద్దలు, గులాబీ బాస్ లు ఇరుకున పడ్డారు. ఆ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ చండ ప్రచండ రూపంతో ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు. కెసిఆర్ కు నేరుగా సవాల్ విసిరారు. మొత్తానికి ఎన్నికల ఫలితాల్లో టిఆర్ ఎస్ కంటే కాస్తంత మాత్రమే బిజెపి వెనుకబడింది. కారు విజయాలకు బ్రేక్ పడింది. టిఆర్ ఎస్ చిత్తుగా ఓడిపోయింది.
ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎంఎల్ సి ఎన్నికలు వస్తున్నాయి. ఇటు హైదరాబాద్ సహా మూడు జిల్లాలకు ఒకటి, అటు వరంగల్ సహా మరో మూడు జిల్లాలకు మరొకటి మండలి సీట్లకు ఎన్నిక ఫిబ్రవరి చివర్లో గానీ మార్చిలో గానీ జరగవచ్చు. అంటే నిరుద్యోగ భృతికి అర్హులను తేల్చడానికి ఒకవేళ ఇప్పటికిప్పుడు కమిటీని వేసినా, దాని నివేదిక రావడానికి కనీసం ఆరు నెలలు పట్టవచ్చు. ఈలోగా గ్రాడ్యుయేట్లు ఓటు వేస్తారు. ఆ తర్వాత కథ కంచికి చేరుతుందా? భృతి పథకం అటకెక్కుతుందా? అనేది నిరుద్యోగ పట్టభద్రుల అనుమానం.