ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యులలో వ్యత్యాసం ఉండకూడదని.. సమానంగా జీతభత్యాలు ఉండాలని సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. “జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) పథకం కింద అల్లోపతి, దంత వైద్య అధికారులతో సమానంగా ఆయుర్వేద వైద్యులు జీతభత్యాలు, వెసులుబాటులు పొందేందుకు అర్హులు” అని జస్టిస్ వినీత్ సరన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకం కింద ఆయుర్వేద వైద్యులు అల్లోపతి, డెంటల్, మెడికల్ ఆఫీసర్లకు సమానమైన వేతనాన్ని పొందుతారని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు సమర్థించింది. గ్రామీణ పేదలకు సరసమైన వైద్యం అందించేందుకు కేంద్రం 2015లో ఈ NRHM పథకాన్ని ప్రవేశపెట్టింది.
రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆయుష్ వైద్య అధికారుల నియామకాలలో చూపిన వ్యత్యాసం కారణంగా ఈ వివాదం మొదలైంది. అల్లోపతి వైద్యులతో పోలిస్తే వారి జీతంలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. సమానత్వం కోసం తమ అభ్యర్థనలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఆయుష్ వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు.