ఈఏడాదిచివరి కల్లా అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తికానున్న నేపథ్యంలో రామ్ లల్లా విగ్రహ తయారీ కోసం నమూనాలు పంపాల్సిందిగా దేశంలోని ప్రసిద్ధి శిల్పులను కోరింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. వాటినుంచి ఒకదానిని ఎంపిక చేసి, విగ్రహాన్ని తయారుచేయిస్తామని ట్రస్ట్ తెలిపింది. సుప్రసిద్ధ శిల్పులు కొందరు శ్రీరాముని విగ్రహ నమూనాలను పంపిస్తారు. ఒడిశాకు చెందిన సుదర్శన్ సాహూ, వాసుదేవ్ కామత్, కర్ణాటకకు చెందిన కేవీ మనియా, పుణేకు చెందిన శస్త్రయజ్య దెవుల్కర్ కూడా శ్రీరాముని విగ్రహ నమూనాలను పంపిస్తారు. 9 అంగుళాల నుంచి 12 అంగుళాల ఎత్తు ఉండే నమూనాలను పంపించనున్నారు.
రామ్ లల్లా విగ్రహం కోసం మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన శిలలను ఎంపిక చేసినట్లు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ తెలిపారు. రామ్ లల్లా విగ్రహ నమూనాను ఖరారు చేసిన తర్వాత ఈ శిలలకు ట్రస్ట్ ఆమోదం తెలుపుతుందని చెప్పారు. విగ్రహంపై సూర్య కిరణాలు పడే విధంగా 8.5 అడుగుల నుంచి 9 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమినాడు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముని నుదుటిపై సూర్య కిరణాలు పడే విధంగా గర్భగుడిలో రాముడిని ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం రూర్కీలోని సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ, పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ , సుప్రసిద్ధ దేవాలయ వాస్తు శిల్పులను నియమించింది.