మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సుప్రీం కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుతో అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అన్ని దారులూ మూసుకుపోయినట్టేనని చెబుతున్నారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 25న తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో హైకోర్ట్ ఏ నిర్ణయం తీసుకోబోతోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సుప్రీంలో విచారణ సందర్భంగా … సునీతా రెడ్డి తరపున లాయర్ సిద్ధార్థ లూథ్రా, అవినాష్ రెడ్డి తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రెండు గంటలపాటు వాదనలు జరిగాయి . ఇరువైపులా వాదనలు విన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టేసింది. లిఖితపూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీం తప్పుపట్టింది. అయితే ఇప్పటి వరకూ ఏప్రిల్-30 వరకూ విచారణ ముగించాలని గతంలో ఇచ్చిన గడువును పొడిగించింది. జూన్-30 లోపు విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది.
తాజా పరిణామాలు చూస్తుంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగి తీరుందనిపిస్తోంది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.